పాలనా రాజధానిపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్.. కొత్త హంగులు దిద్దుకుంటున్న విశాఖ.. అభివృద్ధి పరుగులు పెట్టాలన్న సీఎం జగన్

|

Mar 25, 2021 | 1:01 AM

పాలనా రాజధానికి కొత్త హంగులు సమకూరబోతున్నాయి. సీఎం సమీక్షతో ప్రణాళికలు సిద్ధమవుతుండటంతో.. విశాఖ అభివృద్ధి పరుగులు పెట్టబోతోంది. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిని పెంచటంతో పాటు...

పాలనా రాజధానిపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్.. కొత్త హంగులు దిద్దుకుంటున్న విశాఖ.. అభివృద్ధి పరుగులు పెట్టాలన్న సీఎం జగన్
Visakha Development
Follow us on

పాలనా రాజధానికి కొత్త హంగులు సమకూరబోతున్నాయి. సీఎం సమీక్షతో ప్రణాళికలు సిద్ధమవుతుండటంతో.. విశాఖ అభివృద్ధి పరుగులు పెట్టబోతోంది. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిని పెంచటంతో పాటు…వైజాగ్‌ సిటీ అభివృద్ధికి సిద్ధమైంది ప్రభుత్వం.

ప్రభుత్వ ఆదేశాలతో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధంచేస్తోంది..విశాఖ మెట్రో పాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ. పెరిగిన పరిధికి తగ్గట్లు మాస్టర్‌ప్లాన్‌ సిద్ధంచేసుకుంటోంది VMRDA. జాతీయ రహదారి నుంచి బీచ్ రోడ్‌కి వీలైనన్ని విశాలమైన రోడ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.

విశాఖ మెట్రో ప్రాజెక్టుపై సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి భోగాపురం వరకూ మెట్రో ప్రతిపాదన ఉండాలన్నారు. మొత్తం 76.9 కిలోమీటర్ల మేర నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలని సూచించారు. మొత్తం 53 స్టేషన్లు ఉండేలా ప్రతిపాదనలు సిద్దం చేయనున్నారు. అంతేకాక.. 60.2 కి.మీ. మేర ట్రాం కారిడార్ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మెట్రో, ట్రాం కలిపి 137.1 కి.మీటర్ల కారిడార్ ఏర్పడుతుంది. కేవలం మెట్రో నిర్మాణానికి దాదాపు రూ.14వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేశారు.

దీంతో అవకాశమున్న చోట్ల కొత్త రోడ్లతో పాటు ఉన్న రహదారుల విస్తరణకు సిద్ధమవుతోంది విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ. వారం పదిరోజుల్లో పనులు మొదలవుతాయన్నారు వీఎంఆర్డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు.

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ విస్తరణకు వీలుగా ఉడా స్థానంలో వీఎంఆర్డీఏని ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. తాజాగా విశాఖ జిల్లాలోని మరో 13 మండలాలను మెట్రో రీజియన్‌లోకి చేర్చింది. ఏజెన్సీ మినహా మిగిలిన 431 గ్రామాలను వీఎంఆర్డీఏ పరిధిలోకి చేరుస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

మరోవైపు విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్‌. స్టీల్‌ ప్లాంట్‌ మెయిన్‌ గేట్‌ నుంచి భోగాపురం వరకు 76 కిలోమీటర్ల నిడివి, 53 స్టేషన్లతో మెట్రో నిర్మించాలని సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మొత్తానికి సీఎం వైజాగ్‌పై సమీక్ష నిర్వహించిన 24 గంటల్లోనే వీఎంఆర్డీఏ రంగంలోకి దిగింది. విశాఖలో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారయంత్రాంగం అభివృద్ధిపనులు చేపట్టబోతోంది.

ఇవి కూడా చదవండి:DSC Notification: టీచర్ ఉద్యోగార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలోనే డీఎస్సీ..