విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం అవుతోంది. వారం రోజుల నుంచి ఉద్యమం జరుగుతున్నా టీడీపీ, వైసీపీ నేతలు ఎప్పుడూ ఒకే వేదికను పంచుకోలేదు. తొలిసారి పాత మిత్రులను మళ్లీ కలిపింది స్టీల్ ఫైట్. గంటా, అవంతి… మధ్యలో నారాయణ. ఈ సీన్ కొత్త చర్చకు దారితీసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఏర్పాటు చేసిన సభకు వచ్చారు వీరిద్దరు. మధ్యలో సీపీఐ నారాయణ వచ్చి… చేయి చేయి కలిపే ప్రయత్నం చేశారు. మంత్రి అవంతి… స్మైల్ ఇచ్చినా గంటా మాత్రం పెద్దగా రియాక్ట్ కాలేదు. గంటా మాట్లాడే సమయానికి అవంతి వేదిక దిగి కిందకు వెళ్లారు.
అయితే, ఇదే వేదికపై నుంచి మరోసారి రాజీనామా అస్త్రాన్ని సంధించారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఇటీవలే రాజీనామా చేసినా ఆ లేఖ స్పీకర్ ఫార్మాట్లో లేదు. దాంతో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరో రెండు రాజీనామా లేఖలపైనా సంతకం చేశారు గంటా. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ రాశారు. దీన్ని ఎలాగైనా ఆమోదింపజేయాలన్నారు. సీఎం జగన్ ఎంపీలందరినీ తీసుకుని ప్రధాని దగ్గరకు వెళ్లాలని డిమాండ్ చేశారు గంటా.
ప్రత్యేక అసెంబ్లీ, కేబినెట్ పెట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్నారు గంటా శ్రీనివాసరావు. ఒకే వేదిక పంచుకున్నా… రాజీనామాల విషయంలో అవంతి, గంటా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గంటా రాజీనామా చేస్తే… దాంతో జరిగేది ఏదీ ఉండదన్నారు అవంతి. చివరి అస్త్రంగానే రాజీనామా చేయాలన్నారు. మరోవైపు టీడీపీ నేతల దీక్షకు సంఘీభావం తెలిపారు నారాయణ. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా దీక్షలో పాల్గొన్నారు.