
తక్కువ ధరకు బంగారు ఇప్పిస్తామని మోసం చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన రాజేంద్రప్రసాద్కు బంగారు ఇప్పిస్తామని 7 కోట్ల 32 లక్షల రూపాయలు నెల్లూరు జిల్లా కావలికి చెందిన పోతురాజు రతన్ కుమార్, జస్వంత్, శాంతి పవన్ కుమార్, కట్ట శ్రీకాంత్లు మోసం చేశారని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. నిందితులు నకిలీ బంగారం ఇచ్చారని తెలుసుకున్న బాధితుడు రాజేంద్రప్రసాద్ తనకు బంగారు వద్దని డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా.. కర్నూలుకు రావాలని నిందితులు తెలిపారు. కర్నూలులోని ఓ లాడ్జ్లో బాధితుడిపై దాడి చేసి మరో 50 వేల రూపాయలు తీసుకున్నారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని ఫిర్యాదు స్వీకరించిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి సుధీర్గా గుర్తించారు.
ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. ఈ ముఠా సభ్యులు నకిలీ బంగారు వ్యాపారంతో పాటు ఎవరైనా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తే కొందరు నకిలీ పోలీసులుగా వచ్చి బాధితులను అరెస్టు చేస్తున్నట్లు హడావుడి చేస్తారని.. దీంతో బాధితులు భయంతో తీసుకున్న నకిలీ బంగారు బిస్కెట్లు సైతం నిందితులకు తిరిగి ఇచ్చేవారని డీఎస్పీ తెలిపారు. అరెస్టు అయిన వారి నుంచి 6 లక్షల 40 వేల రూపాయలు, నాలుగు కార్లు, నకిలీ బంగారు బిస్కెట్లు, పోలీసులు వాడే సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..