
విజయవాడలో మూడేళ్ల పాప కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. వందల సీసీ కెమెరాలు, వాహనాల తనిఖీలు చేసి పాప ఆచూకీ కనుగొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో మూడేళ్ల పాప శ్రావణి కిడ్నాప్నకు గురయిందని బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన తండ్రి మస్తాన్ ఫిర్యాదు చేశారు. దాంతో.. అప్రమత్తమైన విజయవాడ పోలీసులు, GRP,RPF సిబ్బంది పాప కోసం స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి గంటల వ్యవధిలోనే కేసును చేధించారు. ఫిర్యాదు చేసిన మస్తాన్ తీరుపై అనుమానంతో ప్రశ్నించగా.. పొంతన లేకుండా సమాధానం చెప్పడంతోపాటు.. రైల్వేస్టేషన్కు ఒక్కడే వచ్చినట్లు గుర్తించిన మరింత లోతుగా దర్యాప్తు చేశారు. భార్య గురించి ఆరా తీయగా ఆమె గురించి తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలోనే.. సీసీ ఫుటేజ్ ఆధారంగా వివిధ కోణాల్లో ఎంక్వైరీ చేయడంతో కేసు కొలిక్కి వచ్చింది.
రాత్రి పదకొండున్నర సమయంలో తండ్రి లేనిప్పుడు ఓ మహిళ, మరో పురుషుడు కలిసి పాపను తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజ్ లభ్యమైంది. అక్కడి నుంచి సీసీ ఫుటేజ్ను వెరిఫై చేస్తూ విజయవాడ బస్టాండ్లో విశాఖ వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కినట్లు గుర్తించారు. ఆ బస్సు డ్రైవర్తో మాట్లాడి పాపను రెస్క్యూ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఆపై రాజమండ్రి జీఆర్పీ సిబ్బందిని కూడా అలెర్ట్ చేసి రాజమండ్రి సమీపంలోని కాతేరు అండర్పాస్ దగ్గర ఆర్టీసీ బస్సును నిలిపివేసి పాపను రెస్క్యూ చేసినట్లు జీఆర్పీ సీఐ జేవీ రమణ తెలిపారు. బొల్లా శ్రీనివాసరావు, చిన్నారి అనే ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. అదేసమయంలో వేటపాలెంకు చెందిన పాప తల్లిని కూడా రప్పించి ఆరా తీయడంతో అసలు విషయాలు బయటకొచ్చాయన్నారు. తల్లి దగ్గర నుంచి పాపాను తీసుకొచ్చి తండ్రే విక్రయించినట్లు తేలిందని.. శ్రీనివాసరావు-చిన్నారికి 5వేలకు అమ్మినట్లు ఒప్పుకున్నాడని చెప్పారు. విజయవాడ నుంచి రాజమండ్రి తీసుకెళ్లి అక్కడ పాపతో బిక్షాటన చేయించేందుకు నిందితులు ప్రయత్నించారన్నారు. ఇక.. పాపను తల్లికి అప్పగించి.. నిందితులను జైలుకు తరలించినట్లు విజయవాడ జీఆర్పీ సీఐ రమణ వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.