AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uravakonda: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు.. కానీ ఇక్కడ మాత్రం..

అనంతపురం జిల్లా ఉరవకొండ డ్రైవర్స్ కాలనీలో అర్ధరాత్రి దొంగలు ఆటోను తోసుకెళ్లి చోరీ చేశారు. మరొక ఆటోను కూడా ఎత్తుకెళ్లే ప్రయత్నంలో ఇంటి నుంచి అలికిడి రావడంతో వదిలేసి పారిపోయారు. మరుసటి రోజు దొంగతనం చేసిన ఆటోను తిరిగి అదే చోటు వద్ద వదిలిపెట్టి వెళ్లారు. ట్విస్ట్ ఏంటంటే..

Uravakonda: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు.. కానీ ఇక్కడ మాత్రం..
Cc Footage
Nalluri Naresh
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 19, 2025 | 4:27 PM

Share

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం డ్రైవర్స్ కాలనీలో అర్ధరాత్రి ఆటో చోరీకి గురైంది. బాధితుడు ఉరవకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు… ఆటో చోరీకి గురైన ప్రదేశానికి సమీపంలోని ఓ ఇంటికి ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులకు.. కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.. అదే విధంగా మరో ఆటో కూడా చోరీ చేస్తుండగా… సీసీ కెమెరాలు ఉన్న ఇంటి నుంచి అలికిడి రావడంతో దొంగలు ఆటోను వదిలేసి పారిపోయారు. ట్విస్ట్ ఏంటంటే మరుసటి రోజు ఉదయం చోరీ చేసిన ఆటోను దొంగలు తిరిగి అక్కడే వదిలేసి వెళ్లారు… అంతటితో ఆగలేదు తమను పట్టించిన సీసీ కెమెరాను రాయితో పగలగొట్టి… ఇంటి యజమానిపై దాడి చేశారు.

ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడన్న సామెత వినే ఉంటారు… ఈశ్వరుడు పట్టుకుంటాడో లేదో తెలియదు కానీ ఇవాళ నిఘా నేత్రాలు మాత్రం ఏం జరిగినా ఇట్టే పట్టిచ్చేస్తున్నాయి… ఉరవకొండ పట్నం డ్రైవర్స్ కాలనీలో అర్ధరాత్రి దొంగలు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆటోను స్టార్ట్ చేస్తే శబ్దం వస్తుందని… మెల్లగా తోసుకుంటూ ఎత్తుకెళ్లారు… ఇది ఏదో బాగుంది అనుకున్న దొంగలు అక్కడే ఉన్న మరో ఆటోను తీసుకెళ్లడానికి ప్రయత్నించగా… సరిగ్గా అదే సమయంలో ఎదురుగా ఉన్న ఇంట్లో నుంచి  ఎవరో బయటకు వస్తున్న అలికిడి వినిపించడంతో దొంగలు ఆటోను అక్కడే వదిలేసి పరారయ్యారు… ఈ మొత్తం వ్యవహారం సీసీ కెమెరాలో రికార్డు అయింది… ఆటోను ఎవరో దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసిన బాధితుడు సీసీ కెమెరా ఫుటేజ్ చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆటో దొంగతనం చేసింది ఎవరో కాదు… ఆటో యజమానికి స్వయానా మేనల్లుడే దొంగ.

ఇంతలో మరో ట్విస్ట్ ఏంటంటే… దొంగతనం చేసిన ఆటోను ముగ్గురు దొంగలు తిరిగి తోసుకుంటూ ఎక్కడైతే దొంగతనం చేశారో అక్కడే వదిలేసి వెళ్లారు.. ఈ దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డయ్యాయి… మూడో కంటికి తెలియకుండా దొంగతనం చేద్దామనుకుంటే… సీసీ కెమెరా పట్టించింది అన్న కారణంతో… సీసీ ఫుటేజ్ ఇచ్చిన ఇంటి యజమానిపై దొంగతనానికి పాల్పడిన దొంగలు ఉదయం తిరిగి వచ్చి దాడి చేశారు. అదే విధంగా సీసీ కెమెరాను రాయితో పగలగొట్టారు.. ఆ దొంగ దురదృష్టం ఏంటో కానీ సీసీ కెమెరాను పగలగొడుతున్న విజువల్స్ కూడా సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి… చోరీకి గురైన ఆటో దొరికిందని బాధితుడు సైలెంట్‌గా ఉన్న… చోరీ చేసింది మేనల్లుడే కదా అని ఆటో యజమాని గమ్మున ఉన్నా… మొత్తం వ్యవహారం సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.