సిరులు కురిపిస్తున్న ఫైనాఫిల్ కోసం గిరిజన రైతుల ప్రయోగం.. సంపాదన ఎంతో తెలుసా..?

| Edited By: Balaraju Goud

Sep 14, 2024 | 2:53 PM

భారతదేశం ఎక్కువగా వ్యవసాయ దేశం. దాదాపు 70% గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయం జీవనోపాధిని అందిస్తుంది. వ్యవసాయంపై ఆధారపడటం వల్ల సాగులో విప్లవాత్మక మార్పులకు, అధిక దిగుబడితోపాటు సంపాదనకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

సిరులు కురిపిస్తున్న ఫైనాఫిల్ కోసం గిరిజన రైతుల ప్రయోగం.. సంపాదన ఎంతో తెలుసా..?
Marises Pinealpple
Follow us on

భారతదేశం ఎక్కువగా వ్యవసాయ దేశం. దాదాపు 70% గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయం జీవనోపాధిని అందిస్తుంది. వ్యవసాయంపై ఆధారపడటం వల్ల సాగులో విప్లవాత్మక మార్పులకు, అధిక దిగుబడితోపాటు సంపాదనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో మన్యం జిల్లాలోని గిరిజనులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మారిషస్ పైనాపిల్ సాగుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా అధికారుల చొరవతో.. కేరళ రాష్ట్రంలో విస్తృతంగా పండే మారిషస్ పైనాపిల్ రకాన్ని మన్యం జిల్లాలో పండించేందుకు ప్రయత్నిస్తున్నారు. మారిషస్ పైనాపిల్ సాగు చేసేందుకు దృష్టి సారించి ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ పంట సాగుకు జిల్లాలోని గుమ్మలక్ష్మిపురం, కొమరాడ, కురుపాం, సీతంపేట, భామిని మండలాల్లో పండించేందుకు చర్యలు చేపడుతున్నారు.

సహజంగా మన్యం జిల్లాలో రైతులు పండించే ప్రధాన పంటల్లో పైనాపిల్ ఒకటి. సంవత్సరానికి దాదాపు పదివేల ఎకరాల్లో రెండు వందల టన్నుల వరకు పైనాపిల్ దిగుబడి వస్తుంది. అయితే రైతులు ఇప్పటివరకు సింహాచలం రకం పైనాపిల్ రకాన్ని సాగుచేశారు. ఈ రకానికి గిరాకీ తక్కువగా ఉండేది. కేజీ 12 నుండి 15 రూపాయల వరకు మాత్రమే ధర పలికేది. సింహాచలం రకం ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవడంతో పాటు జ్యూస్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా జ్యూస్ కూడా అంతగా టేస్ట్ ఉండదు. ఈ రకం పైనాపిల్ కొనడానికి వ్యాపారులు పెద్దగా ఇష్టపడరు. దీంతో రైతులకు కూడా గిట్టుబాటు ధర లేక నష్టాల బాట పడుతున్నారు.

ఈ పరిస్థితిని గమనించిన అధికారులు సింహాచలం రకం పైనాపిల్ స్థానంలో మారిషస్ రకం పైనాపిల్ రకం రైతులు సాగు చేసేలా చర్యలు చేపడుతున్నారు రైతులు. అందుకోసం ఆ దిశగా గిరిజన రైతులకు అవగాహన కూడా కల్పిస్తూ అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ సమాయత్తం చేస్తున్నారు. ఈ మారిషస్ రకం పైనాపిల్ వల్ల రైతుకు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ మారిషస్ రకం పైనాపిల్ కి మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది. ఈ పైనాపిల్ కేజీ సుమారు 50 రూపాయల వరకు ఉంటుంది. అంతేకాకుండా మారిషస్ పైనాపిల్ రకం చెట్టు నుండి కోసిన 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇలాంటి గిరాకీ ఉన్న మారిషస్ పైనాపిల్ ను రైతులు సాగు చేసేలా ప్రోత్సహిస్తే రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారని భావించారు అధికారులు.

అందుకోసం ప్రాథమికంగా ఎనిమిది వేల మొక్కలను 90 శాతం సబ్సిడీతో ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సబ్సిడీ మొక్కలు ఇచ్చేందుకు కావాల్సిన రైతుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అంతేకాకుండా మొక్కలు పెంచేందుకు కావల్సిన ఎరువులు, పనిముట్టులు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అధికారులు చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అయితే మన్యం జిల్లా రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..