Pastor Praveen: ఆ రోజు జరిగింది ఇదే.. పాస్టర్ ప్రవీణ్తో తన సంభాషణను టీవీ9కు వివరించిన ఎస్సై సుబ్బారావు
పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి కేసు ఓ కొలిక్కి వస్తుంది. విజయవాడలో మూడు గంటల పాటు ఎక్కడ ఉన్నారన్న విషయంపై తాజాగా క్లారిటీ వచ్చింది. రామవరప్పాడు రింగ్కు కొద్ది దూరంలో ఉన్న పార్కులో ఆయన కాసేపు సేద దీరినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. అప్పటికే ఆయన కిందపడటంతో బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు ఫోటోల ద్వారా స్పష్టమవుతుంది.
పాస్టర్ ప్రవీణ్ కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. రామవరప్పాడు రింగ్ దగ్గర ప్రవీణ్ బైక్ తొలిసారి ప్రమాదానికి గురైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆయన బైక్పై నుంచి కింద పడటంతో.. పబ్లిక్ అతన్ని లేపి.. పక్కన కూర్చోపెట్టారని అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సై సుబ్బారావు తెలిపారు. ఆ తర్వాత తాను ఆయన వద్దకు వెళ్లి.. దెబ్బలు ఏమైనా తగిలియా అని ఆరా తీసినట్లు ఎస్సై చెప్పారు. ఆపై పక్కనే ఉన్న పార్కు వద్దనే దాదాపు రెండున్నర, మూడు గంటలు సేదదీరినట్లు వెల్లడించారు. ఆయన చాలా నీరసంగా కనిపించారని.. ఎండలో ప్రయాణం చేయడం వల్ల ఆయన అలసిపోయారని భావించినట్లు ఎస్సై తెలిపారు. డ్యూటీ దిగే సమయంలో మంచి నీళ్లు ఇచ్చానని.. ఆపై పక్కనే ఉన్న టీ స్టాల్లో ఆయన టీ తాగారని వివరించారు. ఆపై పాస్టర్ ప్రవీణ్ వెళ్తా అని చెప్పడంతో… బైక్ హెడ్ లైట్ ఊడిపోయి ఉండటంతో వద్దని వారించారట ఎస్సై. బైక్ హెడ్ లైట్ ఊడిపోయి ఉండటంతో.. ఏదైనా తాడు కోసం తాము వెళ్లడంతో.. ప్రవీణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారని ఎస్సై సుబ్బారావు వెల్లడించారు. ఆ సమయంలో ప్రవీణ్ ఒంటిపై గాయాలేమీ లేన్నారు. అక్కడ మాస్క్ పెట్టుకుని కనిపించారు పాస్టర్ ప్రవీణ్.
దీన్ని బట్టి చూస్తే.. ప్రవీణ్ బైకు విజయవాడలోని రామవరప్పాడు రింగ్ దగ్గరే ప్రమాదానికి గురైంది. ఎస్సై సుబ్బారావు, టిఫిన్ సెంటర్ వర్కర్ నాగార్జున ఇదే విషయాన్ని చెబుతున్నారు. అక్కడే ఉన్న పార్కులో ఆయన రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఎస్సై ఫొటో తీశారు. ఇవే ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..