
తిరుమలలో ఈ నెల 26 నుండి మార్చి 2 వరకు నిర్వహించే సాలకట్ల తెప్పోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లుచేస్తోంది. ఇందులో భాగంగానే శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్ నిర్వహించింది. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఏర్పాట్లను పరిశీలించారు.
తెప్పోత్సవాలకు తెప్పలను పూర్తిగా సిద్ధం చేసామన్నారు. ఇంజినీరింగ్, విద్యుత్, ఆలయ అధికారులతో కలిసి తెప్ప సామర్థ్యాన్ని పరిశీలించినట్లు చెప్పారు.
ఐదు రోజుల్లో దర్శనం ఇలా
ఐదు రోజుల పాటు తిరిగే శ్రీవారి తెప్పోత్సవాల్లో తొలిరోజు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్ర మూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి వారు తెప్పలపై విహరిస్తారని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి వివరించారు. చివరి మూడు రోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పలపై భక్తులకు దర్శనమి స్తారన్నారు.
మొదటి మూడు రోజులు మూడు సార్లు, 4వ రోజు ఐదు సార్లు, చివరిరోజు ఏడు సార్లు తెప్పలపై ఉత్సవమూర్తులు విహరించి భక్తులను అనుగ్రహిస్తారని చెప్పారు. తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్ర దీపాలంకార సేవ, ఫిబ్రవరి 28న, మార్చి 01, 02వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసినట్లు అడిషనల్ ఈఓ చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.