
తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే మీకో గమనిక. తిరుమలలో కొన్ని సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది. తిరుమలలో ఈ నెల 25వ తేదీ నుంచి శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు తిరుమల కొండపై ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. నారాయణగిరి ఉద్యానవనాల్లో ఉన్న పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా భక్తులు భారీగా వీటిని చూసేందుకు తిరుమలకు వచ్చే అవకాశం ఉన్న క్రమంలో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. అందులో భాగంగా మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేయనుంది.
ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. భక్తులు దీనికి తగ్గట్లు ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ముందుగానే దీనిని గమనించి ఏర్పాట్లు చేసుకోవాని భక్తులకు టీటీడీ సూచించింది. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. విద్యాసంస్ధలకు సెలవులు రావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో క్యూలైన్లు అన్నీ భక్తులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. దర్శనానికి గంటల కొద్ది సమయం పడుతోంది.
పద్మావతి, శ్రీనివాసుల కళ్యాణోత్సవానికి గుర్తుగా పద్మావతి పరిణోత్సవాన్ని ప్రతీ ఏడాది టీటీడీ నిర్వహిస్తోంది. 1992 నుంచి ఈ వేడుకులను వైశాఖ శుద్ద దశమి నాడు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు మలయప్పస్వామి గజవాహనంపై దర్శనం ఇవ్వనుండగా.. రెండో రోజు అశ్వవాహనం, మూడో రోజు గరుడ వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు. ప్రత్యేక పల్లకీల్లో పద్మావతి, శ్రీనివాసుల పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ తన ప్రకటనలో తెలిపింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి సేవలో పాల్గొనాలని టీటీడీ సూచించింది. ఈ మేరకు అంగరంగ వైభవంగా వేడకలకు ఏర్పాట్లు చేస్తోంది.