టీటీడీ వ‌ద్ద ఉన్న రూ.49.70కోట్ల పాత‌నోట్ల‌ను నిర్వీర్యం చేయానుందా?.. కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం వస్తోంది

| Edited By: Ravi Kiran

Jun 23, 2021 | 1:06 PM

TTD Old Notes: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)వద్ద నిల్వ ఉన్న రద్దు చేసిన పాత నోట్లకు మోక్షం లభించేలా కనిపించడం లేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను..

టీటీడీ వ‌ద్ద ఉన్న రూ.49.70కోట్ల పాత‌నోట్ల‌ను నిర్వీర్యం చేయానుందా?.. కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం వస్తోంది
Old Note
Follow us on

(ముత్యాల అనిల్ కుమార్, TV9 రిపోర్టర్, తిరుమల)

TTD Old Notes: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)వద్ద నిల్వ ఉన్న రద్దు చేసిన పాత నోట్లకు మోక్షం లభించేలా కనిపించడం లేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను ఇప్పటికే ఈ విషయం నాలుగు సార్లు కలిసినా పాతనోట్లను తీసుకునేందుకు సిద్ధంగా లేమని చెప్పినట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. అయితే భక్తుల మనోభావాలు, విశ్వాసాలకు ముడిపడిన అంశం కావడంతో భక్తులు స్వామివారికి సమర్పించిన పాత నోట్లను ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. అసలు టీటీడీ వద్ద ఎన్నిపాత నోట్లు ఉన్నాయా..? పాత నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసుకునేందుకు కేంద్ర సర్కార్‌ ఎందుకు వెనుకడుగు వేస్తోంది..? ఒక వేళ పాత నోట్ల డిపాజిట్లపై స్పష్టతరాని పక్షంలో ఆ పాత నోట్లను టీటీడీ ఏం చేయనుంది..? తిరుమల వేంకటేశ్వరస్వామికి ప్రతి రోజూ కోట్లాది రూపాయలను హుండీ ద్వారా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు భక్తులు.

ఈ క్రమంలో 2016 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేసినప్పటికీ భక్తులు మాత్రం తమవద్ద ఉన్న పాత నోట్లను స్వామివారికి సమర్పిస్తూ వచ్చారు. అలా ఇప్పటి వరకు టీటీడీ వద్ద రూ.49.70 కోట్లు రద్దు చేయబడిన పాత నోట్లు జమ అయ్యాయి. దీనిపై టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు వహిస్తున్న వైవీ సుబ్బారెడ్డి గత రెండేళ్లలో నాలుగు సార్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసి పాత నోట్ల డిపాజిట్‌ చేసుకోవాలని కోరారు. అయితే టీటీడీ వద్ద నిల్వ ఉన్న పాతనోట్లను రిజర్వ్‌ బ్యాంకులో గానీ, ఏ ఇతర బ్యాంకుల్లోనైనా డిపాజిట్‌ చేయడానికి అనుమతించాలని సుబ్బారెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు.

పాత నోట్లపై స్పందించని కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్ర‌భుత్వం 2016, నవంబ‌రు 8వ తేదీన రూ.500, రూ.వెయ్యి నోట్ల‌ను ర‌ద్దు చేసినప్ప‌టి నుంచి టీటీడీ న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించ‌డానికి అనేక ఏర్పాట్లు చేసింది. అయితే భ‌క్తులు ఆ త‌రువాత కూడా స్వామివారికి హుండీ ద్వారా ర‌ద్దు అయిన నోట్లు కానుక‌గా స‌మ‌ర్పిస్తూ వ‌చ్చారు. భ‌క్తుల మ‌నోభావాల‌తో ముడిప‌డిన అంశం కావ‌డంతో భ‌క్తులు ఈ నోట్ల‌ను హుండీలో స‌మ‌ర్పించ‌కుండా నిరోధించే ఏర్పాట్లు టీటీడీ చేయ‌లేక‌పోయింది. ఈ ర‌కంగా భ‌క్తుల నుండి 1.8 ల‌క్ష‌ల రూ.వెయ్యి నోట్లు, 6.34 ల‌క్ష‌ల రూ.500 నోట్లు హుండీ ద్వారా కానుక‌లుగా వ‌చ్చాయి. అనేక బ్యాంకుల్లో లావాదేవీలు జ‌రుపుతున్న టీటీడీ హుండీ ద్వారా ల‌భించే కానుక‌ల‌కు ప‌క్కాగా రికార్డులు నిర్వ‌హిస్తోంది. పాత‌నోట్ల మార్పిడి అంశానికి సంబంధించి 2017 నుంచి టీటీడీ అనేక‌సార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ‌, రిజ‌ర్వు బ్యాంకుకు లేఖ‌లు రాసి విజ్ఞ‌ప్తి చేసినా సానుకూల స్పంద‌న రాలేదు. ఈ నేప‌థ్యంలో టీటీడీ వ‌ద్ద నిల్వ ఉన్న ఈ నోట్ల‌ను బ్యాంకుల్లో డిపాజిట్ చేయ‌డం ద్వారా ల‌భించే సొమ్ముతో మ‌రిన్ని ధార్మిక‌, సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌వ‌చ్చ‌ని టీటీడీ చైర్మ‌న్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం వై.వీ.సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ దృష్టికి ప‌లుమార్లు తీసుకెళ్లారు.

కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ ఏమన్నారు..?

టీటీడీ ప‌లుమార్లు కేంద్రం దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకెళ్లిన‌ప్ప‌టికీ పాత‌నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు కేంద్రం సుముఖ‌త చూప‌డం లేద‌ని జూన్‌19న జ‌రిగిన టీటీడీ పాల‌క మండ‌లి స‌మావేశంలో వై.వీ.సుబ్బారెడ్డి ప్ర‌క‌టించారు. దీంతో త‌మ‌కు పాత‌నోట్ల విష‌యంలో ఏంచేయాలో అర్థం కావ‌డంలేద‌ని చెప్పారు. భ‌క్తులు ఎంతో ప‌విత్రంగా స‌మ‌ర్పించిన కానుక‌లు కావ‌డంతో వాటి విష‌యంలో ముందుకు పోలేక‌పోతున్నామ‌ని చెప్పారు. త‌మ వ‌ద్ద ఉన్న పాత‌నోట్ల‌ను డిపాజిట్ చేసుకుంటే ఇత‌ర సంస్థ‌లు, దేవాల‌యాల ట్ర‌స్టుల నుండి కూడా ఒత్తిళ్లు వ‌స్తాయ‌ని నిర్మలా సీతారామ‌న్ చెప్పిన‌ట్లు వై.వీ.సుబ్బారెడ్డి వెల్ల‌డించారు.

కేంద్రం ఎందుకు వెనుకడుగు వేస్తోంది..?

దేశంలోని ఇత‌ర దేవాల‌యాలు, ధార్మిక సంస్థ‌ల వ‌ద్దే టీటీడీ లాగే పాత‌నోట్ల నిల్వ ఉన్న నేప‌థ్యంలో కేంద్రం టీటీడీ వ‌ద్ద ఉన్న పాత‌నోట్ల‌ను డిపాజిట్ చేసుకుంటే ఆయా సంస్థ‌ల‌కు కూడా ఊత‌మిచ్చిన‌ట్ల‌వుతుంద‌ని కేంద్రం భావిస్తోంది. దీంతో టీటీడీ వ‌ద్ద ఉన్న పాత‌నోట్ల‌ను డిపాజిట్ చేసుకునేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. ఈ నేప‌థ్యంలో టీటీడీ ఆ పాత‌నోట్ల‌ను డిస్పోస్ చేయ‌డానికి కూడా వెన‌క‌డుగు వేస్తోంది. భ‌క్తుల మ‌నోభావాలు, విశ్వాసాల‌కు సంబంధించిన అంశం కావ‌డంతో పాటు ఆ డ‌బ్బుకు ఆధ్యాత్మిక విలువ ఉండ‌టంతో వాటిని డిస్పోస్ చేయ‌లేని ప‌రిస్థ‌తిలో టీటీడీ ఉంది. పాత‌నోట్ల‌ను ప్ర‌స్తుతం టీటీడీ ట్ర‌జెరీలో భ‌ద్ర‌ప‌ర‌చి ఉంచార. కేంద్రం ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని ఎక్కువ‌రోజులు పాత‌నోట్ల‌ను పెట్టుకోలేమ‌ని తెలిపినట్లు వై.వీ.సుబ్బారెడ్డి మీడియాతో చెప్పారు. ఈ నేప‌థ్యంలో పాత‌నోట్ల‌పై కేంద్రం తేల్చ‌కుంటే రూ.49.70కోట్ల పాత క‌రెన్సీని నిర్వీర్యం చేయక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది.