Tirumala: తిరుమల వెళుతున్నారా..? టీటీడీ మరో కొత్త రూల్.. కొండపై ఆ పని చేస్తే..

తిరుమల శ్రీవారి భక్తులకు ప్రశాంతవంతమైన, శబ్ద కాలుష్యం లేని వాతావరణం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండ, రహదారుల్లో హారన్లు ఉపయోగించడంపై నిషేధం విధించింది. హారన్లు, సైరన్లు ఉపయోగించవద్దని సూచించింది. ఈ మేరకు తిరుమలలో బోర్డులు ఏర్పాటు చేసింది.

Tirumala: తిరుమల వెళుతున్నారా..? టీటీడీ మరో కొత్త రూల్.. కొండపై ఆ పని చేస్తే..
Tirumala Darshan

Updated on: Jul 01, 2026 | 6:59 PM

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. మీరు సొంత వాహనాల్లో తిరుమల వెళుతున్నారా? అయితే ఇది మీ కోసమే. తిరుమలలో హారన్ మోగించడంపై టీటీడీ నిషేధం అమల్లోకి తెచ్చింది. ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు టీటీడీ ఆ నిబంధన ప్రవేశపెట్టింది. ఈ మేరకు తిరుమలలో బోర్డులు ఏర్పాటు చేసింది.  సైలెంట్ తిరుమల ఇనిషియేటివ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తిరుమల ఘాట్ రోడ్డుతో పాటు కొండపై వాహనదారులు హారన్ మోగించకూడదు. ఈ విషయాన్ని భక్తులకు తెలిసేలా తిరుమల వెళ్లే ప్రధాన రహదారులతో పాటు కొండపై బోర్డులు ఏర్పాటు చేశారు. శబ్ద కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, హారన్లు, సైరన్లు మోగించకుండా భక్తులు సహకరించాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.

హారన్లు, సైరన్లు బంద్

తిరుమలలో గోవింద నామస్మరణ మాత్రమే వినిపించాలని, ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు హారన్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు అందరికీ వర్తిస్తాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్యాక్సీలు, భక్తుల వాహనాలు, టీటీడీ, పోలీస్ వాహనాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఇక వీఐపీ వాహనాలు, సైరన్ ఉపయోగించే వాహనాలు అత్యవసర సమయంలో మాత్రమే హారన్ ఉపయోగించాలని టీటీడీ తెలిపింది. ప్రతీఒక్కరూ ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. టీటీడీ విజిలెన్స్, పోలీసులు ఈ విషయంపై భక్తులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఇటీవల తిరుమలలో భక్తులతో పాటు వాహనాల రద్దీ కూడా బాగా పెరిగింది. వీకెండ్స్, సెలవు రోజుల్లో వాహనాల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో శబ్ద కాలుష్యం బాగా పెరుగుతోంది. ఈ క్రమంలో తిరుమల కొండపై నో హారన్ జోన్ నిబంధన విధించారు.

ఉల్లంఘిస్తే జరిమానా

గతంలో తిరుమలకు రోజూ 8 వేల వాహనాల వరకు వచ్చేవి. కానీ ఇటీవల వీటి సంఖ్య భారీగా పెరిగింది. రోజుకు 10 వేల వరకు వాహనాలు కొండపైకి చేరుకుంటున్నాయి. పండుగ సెలవులు, వేసవి సెలవులు, వీకెండ్స్‌లో మరింత ఎక్కువగా రద్దీ ఉంటుంది. ప్రత్యేక రోజుల్లో అలిపిరి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. దీంతో శబ్ద కాలుష్యం మరింత పెరుగుతోంది. సాధారణంగా ఆలయాల పరిసర ప్రాంతాలను సైలెంట్ జోన్లుగా ప్రకటిస్తారు. పగటిపూట 50 డెసిబల్స్, రాత్రిపూట 40 డెసిబల్స్‌కు మించి శబ్దం రాకూడదు. అయితే తిరుమలలో ప్రశాంతమైన వాతావరణాన్ని అందించేందుకు టీటీడీ హారన్లపై నిషేధం అమల్లోకి తెచ్చింది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి హారన్ ఉపయోగిస్తే జరిమానాలు విధించే అవకాశముంది.

Follow Us