Tirupati Laddu Row: ఏపీలో ‘ఆపరేషన్‌ ఘీ’.. అన్ని ఆలయాల్లో క్వాలిటీ తనిఖీలు.. శాంపిళ్ల సేకరణ

|

Sep 22, 2024 | 8:41 AM

ఏపీలోని ప్రధాన ఆలయాలపై తిరుపతి లడ్డూ ఎఫెక్ట్‌ పడింది. ప్రముఖ ఆలయాల్లో ఆవు నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేస్తున్నారా? అసలు దేవాలయాల్లో ఉపయోగిస్తున్న నెయ్యిలో క్వాలిటీ ఎంత? దీనిపైనే ఫోకస్‌ పెట్టిన ఏపీ సర్కార్‌...టెంపుల్‌ - శాంపిల్‌ అంటూ ముందుకెళుతోంది. ఆపరేషన్‌ ఘీకి శ్రీకారం చుట్టింది.

Tirupati Laddu Row: ఏపీలో ‘ఆపరేషన్‌ ఘీ’.. అన్ని ఆలయాల్లో క్వాలిటీ తనిఖీలు.. శాంపిళ్ల సేకరణ
Tirupati Laddu Row
Follow us on

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు, నివేదికలు…ఏపీలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లో కూడా కలకలం రేపుతున్నాయి. ఈ ఎఫెక్ట్‌… విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాచలం అప్పన్న దేవాలయాలపై గట్టిగానే పడింది. ఆయా ఆలయాల్లో ప్రసాదాలను ఆవు నెయ్యితోనే తయారు చేస్తున్నారా? నాణ్యతా ప్రమాణాలు ఎంతవరకు పాటిస్తున్నారు అనేదానిపై ఏపీ సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది.

శాంపిల్స్‌ సేకరణ.. ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్‌ ఘీ

అన్ని అలయాల్లోనూ నెయ్యి క్వాలిటీపై ప్రభుత్వం దృష్టి సారించింది. సింహాచలం, అన్నవరంలో ప్రసాదాల నుంచి శాంపిల్స్ సేకరించారు. ఇలా ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్‌ ఘీకి శ్రీకారం చుట్టింది చంద్రబాబు సర్కార్‌. దీనిలో భాగంగాలో సింహాచలంలో తనిఖీలు నిర్వహించారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. ప్రసాదం నాణ్యతను పరిశీలించి రికార్డులను చెక్‌ చేశారు గంటా. లడ్డూ బరువును తూకం వేసి పరిశీలించారు. తక్కువ రేట్లకు నెయ్యి కొంటే..దానిలో క్వాలిటీ ఎలా ఉంటుందని అధికారులను ప్రశ్నించారు.

రెండేళ్లుగా ఒకరికే టెండర్‌

ఇక అన్నవరం ప్రసాదంపై కూడా ఆరోపణలు రావడంతో…ప్రసాదం తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ పరిశీలించారు. ప్రసాదం నాసిరకంగా ఉందని ఆరోపణలు రావడంతోనే తనిఖీలు నిర్వహించామన్నారు ఎమ్మెల్యే. 6 నెలలకు ఒకసారి టెండర్‌ను మార్చాల్సి ఉందని, అయితే రెండేళ్లుగా ఒకే వ్యక్తికి టెండర్‌ ఇచ్చారన్నారు సత్యప్రభ. ప్రసాదంలో వాడే పదార్థాల శాంపిల్స్‌ను సేకరించామని, దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు.

ఇలా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రసాదాల పరీక్ష, టెండర్ల తనిఖీ, వస్తువుల క్వాలిటీ చెకింగ్‌ చేపడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..