Tiger Panic: అర్ధవీడు పరిసరాల్లో పెద్దపులి సంచారం .. ఆహారం కోసమే గ్రామాల్లోకి వస్తుందన్న ప్రజలు
ప్రకాశంజిల్లా అర్ధవీడు మండలంలో ఇప్పుడు పెద్దపులి సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత కొద్దిరోజులుగా అర్ధవీడు మండలంలోని లక్ష్మీపురం, బోల్లి పల్లె గ్రామాల పరిసర ప్రాంతాలలో పెద్దపులి తిరుగుతూ ఉండడంతో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

నిన్న అడుగుజాడలు.. నేడు చావుకేకలు.. ప్రకాశంజిల్లా అర్ధవీడు గ్రామాల్లో హడలెత్తిస్తున్న పెద్దపులి.. ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. అయితే రావడం మాత్రం పక్కా.. పాదముద్రలు బట్టి పెద్దపులి అని తేల్చేశారు అటవీశాఖ అధికారులు.. రెండు రోజుల వ్యవధిలో ఓ ఆవు, ఒక గేదెను చంపేసింది పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి.
ప్రకాశంజిల్లా అర్ధవీడు మండలంలో ఇప్పుడు పెద్దపులి సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత కొద్దిరోజులుగా అర్ధవీడు మండలంలోని లక్ష్మీపురం, బోల్లి పల్లె గ్రామాల పరిసర ప్రాంతాలలో పెద్దపులి తిరుగుతూ ఉండడంతో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లక్ష్మీపురం గ్రామ సమీపంలోని మేతకు వెళ్లిన ఓ గేదెపై పెద్దపులి దాడి చేసి చంపితినేసింది.. అంతేకాకుండా బొల్లిపల్లె గ్రామ సమీపంలో కూడా ఆవుపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పెద్దపులి సంచారం పై నిఘా పెట్టారు. ఇప్పటికే పెద్దపులి తిరుగుతున్న పరిసర ప్రాంతాలలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామాలకు అతి సమీపంలోనే నల్లమల అటవీ ప్రాంతం ఉండడంతో ఆహారం కోసం పెద్దపులి వస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. పెద్దపులి తిరుగుతున్న ప్రాంతాలలో పులి పాదముద్రలను పరిశీలించి స్థానిక గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు.
సిసి కెమెరాల ద్వారా గుర్తింపు.
ఈ ఏడాది జనవరి, అక్టోబర్ నెలల్లో అటవీ శాఖ అధికారులు పులి సంచారాన్ని ధ్రువీకరిస్తూ పాదాల ముద్రలను సేకరించారు. రాత్రి వేళల్లో పెద్దపులి సంచారాన్ని కనిపెట్టేందుకు అక్కడక్కడ సిసి కెమెరాలను అమర్చారు. ఓ కెమెరాలో పెద్దపులి జాడలు గుర్తించారు. పెద్దపులి సంచరిస్తూ ఉండడంతో స్థానిక గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జునసాగర్ – శ్రీశైలం అభయారణ్యంలో పెద్దపులుల సంఖ్య పెరగడంతో ఆహారంకోసం అభయారణ్యం దాటి వస్తున్నాయని భావించారు.
అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో గ్రామాలు ఉండడంతో పెద్దపులి ఆహారం కోసం తిరుగుతూ ఉందని మేత కోసం పశువులను అడవిలోకి పంపవద్దని రైతులకు అటవీ శాఖ అధికారులు సూచించారు… అప్పటి నుంచి కనిపించని పులిజాడలు తిరిగి ఈరోజు అర్ధవీడు మండలం బొల్లిపల్లె గ్రామ శివారులో కనిపించడంతో గ్రామస్థులు హడలిపోతున్నారు. అధికారులు కూడా పాదముద్రలను పరిశీలించి అవి పెద్దపులివిగా నిర్ధారించారు. అర్ధవీడు అటవీప్రాంతంలో తరచూ పెద్దపులి కనిపిస్తుండటంతో పెద్దపులిని పట్టుకుని దూరంగా అడువుల్లో వదిలివేయాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..