ఈ స్టోరీ అట్లాంటి.. ఇట్లాంటిది కాదు.. ట్విస్టుల మీద ట్విస్టులు.. షాకింగ్లు ఉంటాయి. మరి లేట్ ఎందుకు లుక్కేసేద్దాం.. మద్యం సేవించేందుకు డబ్బులు లేకపోవడంతో ఏకంగా లిక్కర్ షాపులోనే చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. స్థానికంగా సంచలనంగా మారింది.
నంద్యాలలో దొంగలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ప్రధాన రహదారుల్లో ఉండే బీడీ షాపులు, వస్త్ర దుకాణాలు, దేవాలయాల్లోని హుండీలు, సెల్ఫోన్ షాపుల్లో చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే పద్మావతి నగర్లో గల ప్రభుత్వ లిక్కర్ మాల్లో దుండగులు చోరీ చేయడం కలకలం రేపింది. దొంగలు మాల్ పైకప్పు పగలగొట్టి వాటర్ పైప్ ద్వారా కిందికి దిగి చోరి చేశారు.
ప్రభుత్వ లిక్కర్ మాల్లో క్యాష్ కౌంటర్లోని రూ.5 లక్షల నగదుతో పాటు విలువైన లిక్కర్ బాటిళ్లు అపహరించినట్లు మాల్ సూపర్ వైజర్ గుర్తించాడు. ఉదయం షాపు తాళాలు తీసి చూడగా చోరి జరిగిన విషయాన్ని గమనించి.. టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు లిక్కర్ మాల్ చేరుకుని విచారణ చేపట్టారు. దుండగుల అనవాళ్ల కోసం క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. లిక్కర్ మాల్ సూపర్ వైజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గత రెండు నెలల కాలంలో వరుసగా దొంగతనాలు చేస్తున్న ఈ ముఠాను పట్టుకోవడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ దొంగలు దొరక్కపోవడం.. ఎక్కడో ఒక చోట మరలా దొంగతనం చేస్తూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.