తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం, మార్చి 14న ఎన్నికలు

|

Feb 12, 2021 | 4:44 PM

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎంఎల్‌సి ఎన్నికలకి మార్గం సుగమం అయింది. ఎంఎల్‌సి ఎన్నికలు మార్చి 14 న..

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం, మార్చి 14న ఎన్నికలు
Follow us on

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎంఎల్‌సి ఎన్నికలకి మార్గం సుగమం అయింది. ఎంఎల్‌సి ఎన్నికలు మార్చి 14 న జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఎన్నికకు సంబంధించి ఫిబ్రవరి 16 న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్లు దాఖలు చేసే చివరి తేదీ ఫిబ్రవరి 23. నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 24 న నిర్వహించబడుతుంది. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 29.

మార్చి 14 న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి తెలిపారు. మార్చి 17 న కౌంటింగ్ జరుగుతుందని, మార్చి 22 న ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు. కాగా, తూర్పు, పశ్చిమ గోదావరి నియోజకవర్గాలకు తుది ఎన్నికల జాబితాలో 17,285 మంది ఓటర్లు ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 9,560 మంది ఓటర్లు ఉంటే, పశ్చిమ గోదావరి జిల్లాలో 7,725 మంది ఓటర్లు ఉన్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో 5,953 మంది పురుష ఓటర్లు ఉండగా, 3,607 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక, పశ్చిమ గోదావరి జిల్లాలో 4,693 మంది పురుష ఓటర్లు ఉంటే, 3,032 మంది మహిళా ఓటర్లు ఉన్నారని మురళీధర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలో 67, పశ్చిమ గోదావరిలో 49 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ 1950 (జిల్లా ఎన్నికల అధికారి) లేదా, తహశీల్దార్లు, ఎంపిడిఓ లేదా మునిసిపల్ కార్యాలయాలకు కాల్ చేసి ఓటర్లు మరింత సమాచారం పొందవచ్చని కలెక్టర్ వివరించారు.

Read aslo: ఊపిరిపీల్చుకున్నంత హాయిగా ఉంది.. రాజ్యసభ సాక్షిగా రాజీనామా చేసిన రైల్వేశాఖ మాజీ మంత్రి, సీఎం మమతకి మరో షాక్.!