AP – Telangana: తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఏయే జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఉందో తెలుసుకుందాం..
తుఫాన్ ప్రభావం తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో గురువారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే పునరావాస కేంద్రాలుగా ఉన్న విద్యాసంస్థలకు మాత్రం సెలవులు కొనసాగనున్నాయి. ఏయే చోట్ల సెలవులు ఉన్నాయి.. ఎక్కడ తరగతులు కొనసాగుతాయి..? విద్యార్థులకు ఆ క్లారిటీ ఇచ్చేందుకే ఈ కథనం...

పునరావాస కేంద్రాలు ఉన్న పాఠశాలలు మినహా జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు ఫిట్నెస్ ధ్రువీకరణ అనంతరం యథావిథిగా ఈ నెల 30వ తేదీ గురువారం నుంచి పనిచేస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్ అండ్ బీ ఇంజనీర్లతో ఫిట్నెస్ ధ్రువీకరణ జరిగేలా ఎంఈవోలు, తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తరగతి గదులు, పైకప్పులు, ప్రహరీ గోడలు, విద్యుత్ కనెక్షన్లు, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు అన్నీ సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే సిబ్బందిని, విద్యార్థులను పాఠశాల భవనాల్లోకి అనుమతించడం జరుగుతుందన్నారు. పునరావాస కేంద్రాలు ఉన్న పాఠశాలలు మాత్రం అధికారుల ఆదేశాల మేరకు పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంత వరకు సెలవులు కొనసాగించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. అటు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కూడా స్కూల్స్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయాన్నే పాఠశాలల్ని శుభ్రపరిచి క్లాసులు నిర్వహిస్తామన్నారు.
ఇక వానలు, వరదల తీవ్రత తగ్గని నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం కూడా పాఠశాలలు సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖ జిల్లాలో మొంథా తుఫాను నేపధ్యంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో అన్ని పాఠశాలలకు (పదవ తరగతి వరకు), అంగన్వాడీలకు 30 తేదీన (గురువారం) సెలవుగా జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ ప్రకటించారు.
అనకాపల్లి జిల్లాలో గల విద్యాసంస్థలలో మొంథా తుఫాను పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి, నిర్వాసితులకు వసతి కల్పించిన కారణంగా జిల్లాలో గల అన్ని విద్యాసంస్థలకు 30వ తేది గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read: చూశారా మీరు ఇలాంటి పాముని.. గాలి వాన వచ్చినా కదలికే లేదు..
ఇటు తెలంగాణలోని వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గురువారం స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా తగ్గని నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో గురువారం సిద్దిపేట జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హైమావతి వెల్లడించారు.
ఇక మిగతా జిల్లాల గురించి కూడా ఎప్పటికప్పుడు ఈ కథనంలో అప్ డేట్స్ ఇస్తూ ఉంటూ ఉంటాం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
