అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండగా, తెలంగాణలోనూ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
Weather Alert

Updated on: Aug 17, 2026 | 7:28 AM

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం.. వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ – ఉత్తర ఒడిశా తీరప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడి.. ఆ ప్రాంతంలోనే కొనసాగుతున్నట్లు తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో వాయవ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో మంగళవారం వరకు గంటకు 40 నుండి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉండి, అలలు ఎగసిపడే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే తిరిగి రావాలని సూచించింది.

వాతావరణం కింద విధంగా ఉండనుంది..

అల్పపీడనం ప్రభావంతో సోమవారం (17-08-2026) శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణలో వర్షాలు..

కాగా.. తెలంగాణలో సైతం వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో సోమవారం మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us