
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు చలి పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చాలా జాల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రోజువారీ పనుల కోసం ఉదయం బయటికి వెళ్లే ప్రజలు.. తీవ్ర చలి వల్ల ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగ మంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులు, కోల్డ్ వేవ్ పై అలర్ట్ జారీ చేసింది.. మరో రెండు రోజులు చలి తీవ్రత పెరుగుతుందని, రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంటోంది..
అమరావతి వాతావరణ కేంద్రం.. ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో సోమవారం, మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. రాగల 2 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం, రాయలసీమ లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముకంటే 2-4 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముంది. తర్వాత 3 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేదు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. దక్షిణ ఆంధ్ర కోస్తా తీరానికి సమీపంలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్రమట్టం నుండి 1.5 కి మీ ఎత్తులో ఈరోజు ఏర్పడింది.రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా తూర్పు, ఆగ్నేయ దిశల నుండి వీచుచున్నవి. రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
సోమవారం, మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3°C నుండి 4°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..