
బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న దంపతులు బాబూరావు, హిమబిందు ఆరు నెలల క్రితం తమ స్వగ్రామమైన ప్రకాశం జిల్లా కమ్మినేని వారి పాలెం గ్రామానికి సరదాగా శెలవులు గడిపేందుకు వచ్చారు. 2025 సెప్టెంబర్ 2వ తేది రాత్రి సుమారు ఎనిమిదిన్నర గంటలకు తిరిగి స్వగ్రామం నుంచి బెంగుళూరుకు బస్సులో బయలుదేరారు. ప్రయాణం మధ్యలో రాత్రి సమయంలో బస్సు ఒంగోలు సౌత్ బైపాస్ వద్ద ఉన్న వశిష్ట ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర భోజనం కోసం ఆగింది. బాబూరారు, ఆయన భార్య హిమబిందు భోజనం చేసే నిమిత్తం బస్సు దిగి హోటల్కు వచ్చారు. భోజనం అనంతరం 15 నిమిషాల తరువాత తిరిగి బస్సు ఎక్కి బయలుదేరారు. మరుసటి రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో బెంగళూరు చేరుకున్నారు. అనంతరం ఇంటికి వెళ్లి బ్యాగులో ఉన్న నగలను బీరువాలో పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే బ్యాగులో ఉండాల్సిన 120 గ్రాముల బంగారు నగలు కనిపించలేదు. బస్సులో ప్రయాణ సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బంగారం చోరి చేసినట్టు గుర్తించి అనంతరం ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రకాశం జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు తాలూకా సీఐ విజయ్ కృష్ణ, సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అన్ని కోణాలలో దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదుదారులు ప్రయాణించిన బస్సులో సీసీ కెమెరాలు ఉండటంతో ఫుటేజ్ సేకరించి నిందితుల కోసం అన్వేషించారు. నిందితులు మధ్యప్రదేశ్ ధార్ జిల్లాకు చెందినవారిగా గుర్తించి సాంకేతిక పరిజ్ఙానం ఉపయోగించి వారిని పట్టుకొచ్చారు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 10 లక్షల విలువైన 120 గ్రాముల బంగారు నగలను రికవరీ చేసి ఫిర్యాదుదారులకు అందించారు.
బస్సులో ప్రయాణం చేసే సమయంలో తమ విలువైన ఆభరణాలు, నగదు విషయంలో ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకాశంజిల్లా ఎస్పీ హర్షవర్దన్రాజు సూచించారు. అలాగే ప్రతి ట్రావెల్ బస్సులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని బస్సు యజమానులను ఆదేశించారు. ఈ చోరీ కేసులో ప్రతిభ కనపరిచిన ఒంగోలు టౌన్ డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సీఐ .విజయ్ కృష్ణ, ఎస్ఐ రామకృష్ణ. హెడ్ కానిస్టేబుల్స్ అన్వార్ భాష, కె.రామకృష్ణ, ఆర్ రాంబాబులను జిల్లా ఎస్పి హర్షవర్దన్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.
Techie Couple Robbed In Bus 1