
ఆంధ్రప్రదేశ్లో విపక్ష కూటమిపై సస్పెన్స్కు తెరపడింది. భారతీయ జనతా పార్టీ లేకుండానే, తొలి జాబితా ప్రకటించేశాయి తెలుగుదేశం, జనసేన పార్టీలు. ఇప్పటికే అధికార వైసీపీ 65 మందితో జాబితాను ప్రకటించగా, ఏకంగా 99 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది టీడీపీ-జనసేన కూటమి. సీట్ల ప్రకటన, రెండు వైపులా సిటపటలకు కారణమవుతున్న వేళ.. ఏపీ రాజకీయం రసకందాయంలో పడింది.
తొలి జాబితాలో మొత్తం 99 స్థానాకు అభ్యర్థులను ఖరారు చేసింది టీడీపీ, జనసేన కూటమి. 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించగా, ఐదుచోట్ల జనసేన క్యాండిడేట్స్ను కన్ఫామ్ చేశారు పవన్ కల్యాణ్. జనసేనకు మొత్తంగా 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలను కేటాయించింది టీడీపీ. అయితే, అసెంబ్లీ, పార్లమెంట్ కలిపితే… తాము 40 స్థానాల్లో పోటీచేస్తున్నట్టేనని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.
పేరు: నాదెండ్ల మనోహర్
వయసు: 58 సంవత్సరాలు
విద్యార్హత : ఎం.బి.ఎ.
నేపథ్యం:
తెనాలి నుంచి రెండు దఫాలు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. తెనాలి నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్రను చూపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సభాపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించి అందరి మన్ననలు పొందారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
పేరు: లోకం మాధవి
వయసు : 54 సం.
విద్యార్హత : ఎం.ఎస్.
నేపథ్యం :
ఇస్రోలో ప్రోగ్రామర్ గా, ఫోర్డ్ కంపెనీలో డేటా ఆర్కిటెక్ట్ గా సేవలు అందించారు. అనంతరం మిరాకిల్ సాఫ్ట్ వేర్ సిస్టమ్స్ సంస్థను స్థాపించారు.. మిరాకిల్ పేరుతో విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. 2019లో నెల్లిమర్ల నుంచి జనసేన తరఫున పోటీ చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
పేరు: కొణతాల రామకృష్ణ
వయసు: 67 సం.
విద్యార్హత : ఎం.కాం.
నేపథ్యం :
రెండు దఫాలు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు.
పేరు: పంతం నానాజీ
వయసు : 62 సం.
విద్యార్హత : ఇంటర్మీడియెట్
నేపథ్యం:
2019లో కాకినాడ రూరల్ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యునిగా, కాకినాడ రూరల్ ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా పని చేశారు.
పేరు: బత్తుల బలరామకృష్ణ
వయసు : 50 సం.
విద్యార్హత : 10వ తరగతి
నేపథ్యం:
వ్యాపారాలు నిర్వర్తిస్తున్నారు. ఈయన ప్రస్తుతం రాజానగరం అసెంబ్లీకి జనసేన పార్టీ ఇంచార్జ్ గా బాధ్యతలు చూస్తున్నారు. ఈయన భార్య గాదరాడ-2 నుంచి ఎం.పి.టి.సి.గా ఉన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…