అప్పు ఇచ్చే బ్యాంక్ కాదు.. ప్రాణం నిలిపే బ్యాంక్! శ్రీకాకుళం పోలీసుల వినూత్న ప్రయత్నం..!
సాధారణంగా బ్యాంకులు అంటే డబ్బులు దాచుకోవడానికో లేదా అప్పులు తీసుకోవడానికో వేదికలు. కానీ, శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త ఆలోచనతో "హెల్మెట్ బ్యాంకులను" అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ వినూత్న కాన్సెప్ట్, వాహనదారుల ప్రాణాలకు రక్షణ కవచంలా నిలవబోతోంది.

సాధారణంగా బ్యాంకులు అంటే డబ్బులు దాచుకోవడానికో లేదా అప్పులు తీసుకోవడానికో వేదికలు. కానీ, శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త ఆలోచనతో “హెల్మెట్ బ్యాంకులను” అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ వినూత్న కాన్సెప్ట్, వాహనదారుల ప్రాణాలకు రక్షణ కవచంలా నిలవబోతోంది.
ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులో లోన్ తీసుకున్నట్లుగానే, తలకు హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులు పోలీసులకు చిక్కితే, వారికి జరిమానా వేయకుండా ఈ బ్యాంకు ద్వారా ఉచితంగా హెల్మెట్ను అందజేస్తారు. హెల్మెట్ పొందిన వాహనదారుడు 48 గంటల్లోగా దానిని తిరిగి పోలీసులకు అప్పగించాలి. తిరిగి ఇచ్చే సమయంలో సదరు వ్యక్తి సొంతంగా హెల్మెట్ కొనుగోలు చేసినట్లు పోలీసులకు చూపించాల్సి ఉంటుంది. గడువులోగా హెల్మెట్ తిరిగి ఇవ్వని పక్షంలో, కంట్రోల్ రూమ్ నుండి హెచ్చరికలు అందుతాయి. అప్పటికీ స్పందించకపోతే భారీ జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది.
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డిలు శనివారం (ఏప్రిల్ 26) శ్రీకాకుళం నగరంలోని మిల్లు జంక్షన్, డే అండ్ నైట్ జంక్షన్, బలగ ప్రాంతాల్లో తొలి మూడు బ్యాంకులను ప్రారంభించారు. ప్రతి బ్యాంకులో సుమారు 100 హెల్మెట్లు అందుబాటులో ఉంటాయి. మే నెలాఖరు నాటికి ఆమదాలవలస, పలాస, టెక్కలి వంటి పట్టణాల్లో మరో 10 బ్యాంకులు ఏర్పాటు చేయనున్నారు. నిర్వహణ బాధ్యతలను ట్రాఫిక్ పోలీసులు, హోంగార్డులు పర్యవేక్షిస్తారు.
శ్రీకాకుళం జిల్లాలో జరిగే రోడ్డు ప్రమాద మరణాల్లో 62 శాతం ద్విచక్ర వాహనదారులే ఉండటం ఆందోళన కలిగించే అంశం. జిల్లాలో సుమారు 2 లక్షల వాహనాలు ఉన్నా, కేవలం 5 శాతం మంది మాత్రమే హెల్మెట్ ధరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో, ప్రజలను భయపెట్టడం కంటే బాధ్యతాయుతంగా మార్చడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు.
మోటార్ వాహన చట్టం ప్రకారం బైక్ నడిపేవారు హెల్మెట్ పెట్టుకోవటం తప్పనిసరి. లేదంటే జరిమానా ఉంటుంది. అయితే ముందే జరిమానాలు వేసి వాహనదారులను ఆర్థికంగా ఇబ్బంది పెట్టటం కంటే వారిలో అవగాహన కల్పించటం, హెల్మెట్ వాడకాన్ని అలవాటు చేయటం బెటర్ అని జిల్లా SP మహేశ్వర రెడ్డి కొత్తగా ఆలోచించి ఈ హెల్మెట్ బ్యాంక్ లను నెలకొల్పారు. మరికొద్ది రోజుల్లో నో హెల్మెట్.. నో పెట్రోల్.. ఈ నిబంధనలను జిల్లావ్యాప్తంగా తీసుకురానున్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించే గ్రామాలను “అభయ గ్రామాలు”గా గుర్తించి, ఆయా గ్రామాలకు ప్రత్యేక సహాయం కూడా అందించనుంది జిల్లా పోలీస్ శాఖ.
“హెల్మెట్ మీకు రక్షణ కవచం – మీ కుటుంబానికి అభయం” అనే సందేశాన్ని చాటిచెబుతూ జిల్లా అధికారులు స్వయంగా బైక్ ర్యాలీలో పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపారు. జరిమానాల కంటే ప్రాణ రక్షణే ముఖ్యమని భావించి తెచ్చిన ఈ అభయం హెల్మెట్ బ్యాంకులు ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
వీడియో ఇక్కడ చూడండి…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
