Andhra Pradesh: ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే ఎవరూ ఊహించని క్లైమాక్స్..

సోషల్ మీడియా పరిచయం కాస్తా ప్రేమగా మారింది.. కలకాలం కలిసి ఉంటానని అతడు చెప్పిన మాటలను ఆ యువతి నమ్మింది..కానీ పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఆ ప్రియుడు అసలు రంగు బయటపడింది. నమ్మిన వాడే నట్టేట ముంచడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఎవరూ ఊహించని కఠిన నిర్ణయం తీసుకుంది. అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే ఎవరూ ఊహించని క్లైమాక్స్..
Software Engineer Kirthi Ends Life

Edited By:

Updated on: Jul 16, 2026 | 7:17 PM

ప్రేమ పేరుతో నమ్మించి, మరో యువతితో నిశ్చితార్థం చేసుకుని మోసం చేయడంతో మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో గురువారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం చిన్న కుండ్రుపాడు గ్రామానికి చెందిన కీర్తి ముంబైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ప్రకాశం జిల్లా పొందూరుకు చెందిన సాయి సుమంత్ ప్రస్తుతం గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరికీ ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లోనే పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. ఏళ్ల తరబడి ఇద్దరూ కలిసి తిరిగారు, పెళ్లి చేసుకుని ఒకటవ్వాలని కలలు కన్నారు. కీర్తి తన ఇంట్లో వారిని ఒప్పించింది కూడా.

ప్రియుడి డబుల్ గేమ్.. నిశ్చితార్థంతో షాక్

అయితే సాయి సుమంత్ తల్లిదండ్రులు మాత్రం వీరి ప్రేమను అంగీకరించలేదు. సరికదా, నెల రోజుల క్రితం సాయి సుమంత్‌కు మరో యువతితో నిశ్చితార్థం కూడా జరిపించారు. ఒకవైపు కీర్తిని పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూనే, మరోవైపు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధపడి సాయి సుమంత్ డబుల్ గేమ్ ఆడాడని కీర్తి స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ముంబై వచ్చిన సాయి సుమంత్, కీర్తితో కలిసి గడిపాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో సాయి సుమంత్ స్వగ్రామానికి వెళ్లి, ఆ తర్వాత గల్ఫ్ వెళ్లిపోయాడు. నమ్మిన వాడే నట్టేట ముంచాడనే తీవ్ర మనోవేదనతో కీర్తి ముంబైలోనే ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది.

తల్లిదండ్రుల ఆవేదన

“మా కూతురు చావుకు సాయి సుమంత్ మాత్రమే కారణం. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. అతడిని కఠినంగా శిక్షించాలి.” అని కీర్తి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కీర్తి మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. యువతి మృతదేహాన్ని నేరుగా పొందూరు గ్రామంలోని సాయి సుమంత్ ఇంటి ముందుకు తీసుకెళ్లి ఆందోళనకు దిగారు. కీర్తి చివరి కోరిక మేరకు, సాయి సుమంత్‌తో చనిపోయిన కీర్తికి పెళ్లి జరిపించాలని, ఆ తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు భీష్మించుకు కూర్చున్నారు. ఈ ఆందోళనతో పొందూరు గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రంగంలోకి దిగిన పోలీసులు

బాధిత కుటుంబ సభ్యుల ఆందోళనతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. సాయి సుమంత్ అందుబాటులో లేనందున, కీర్తి ఆఖరి కోరికను గౌరవిస్తూ ప్రియుడి తరపు బంధువులే అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు సూచించారు. దీనికి సాయి సుమంత్ మేనమామ ముందుకు వచ్చి కీర్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అంగీకరించడంతో పొందూరు గ్రామంలో నెలకొన్న వివాదం తాత్కాలికంగా సద్దుమణిగాయి.

Follow Us