Andhra News: సింగరకొండ ఆలయంలో రూ. 1.51 కోట్ల కుంభకోణం..! ఈఓకు చార్జ్ షీట్!
ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. కుంభాభిషేకం పేరిట భారీ మొత్తంలో నిధుల దారిమళ్లింపు కలకలం రేపుతోంది! భక్తుల కానుకలు, స్వామివారి నిధులు ఏకంగా ఒక కోటి 51 లక్షల రూపాయల మేర దుర్వినియోగమైనట్లు దేవాదాయ శాఖ ప్రాథమిక విచారణలో తేలింది.

ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. కుంభాభిషేకం పేరిట భారీ ఎత్తున ఆర్థిక అక్రమాలు జరిగినట్లు తాజాగా దేవాదాయ శాఖ ప్రాథమిక విచారణలో తేలింది. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న ఎమ్. తిమ్మనాయుడు నిబంధనలను తుంగలో తొక్కి దాదాపు రూ. 1.51 కోట్ట ఆలయ నిధులను దుర్వినియోగం చేసినట్లు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ చార్జ్ షీట్ జారీ చేస్తూ 10 రోజుల్లో రాతపూర్వక సమాధానం ఇవ్వాలని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్కు ఆదేశాలు జారీ చేశారు.
బడ్జెట్ ఆమోదం లేకుండానే నిధుల దారి మళ్లింపు
గత ఏడాది జరిగిన కుంభాభిషేక మహోత్సవం కోసం ఉన్నతాధికారుల నుండి ఎలాంటి ముందస్తు బడ్జెట్ ఆమోదం లేకుండానే రూ. 2.07 కోట్ల నిధులను ఖర్చు చేయడానికి సిద్ధపడ్డట్టు విచారణలో తేలింది. ఆలయ అభివృద్ధి పనుల కోసమని కేటాయించిన ‘పునరుద్ధరణ ఖాతా’ నుండి నిబంధనలకు విరుద్ధంగా రూ. 1,25 కోట్లు కుంభాభిషేక ఖర్చుల కోసం మళ్లించినట్టు అధికారులు గుర్తించారు. అలాగే సాధారణ ఖాతా నుండి మరో రూ. 11,22,896 దారి మళ్లించినట్లు తేల్చారు.
పోస్టల్ ఆహ్వాన పత్రికల్లో భారీ ఫ్రాడ్
ఆలయ కుంభకోణంలో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, భక్తులకు ఆహ్వాన పత్రికలు పంపే ఖర్చుల్లో పెద్ద ఎత్తున నకిలీలు సృష్టించారు. పోస్టల్ పంపకాల కోసం వాస్తవానికి రూ. 1,37,555 ఖర్చు చేయగా.. క్యాష్ బుక్లో మాత్రం ఏకంగా రూ. 4,17,370 ఖర్చు చేసినట్టు చూపించారు. అంటే ఏకంగా రూ. 2,79,815 స్వాహా చేసినట్లు స్పష్టమవుతోంది. అలాగే రూ. 12.15 లక్షల విలువైన గెస్ట్ హావ్స్, ఆలయ భవన మరమ్మతు పనులకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా తప్పించుకోవడానికి, ఒక్కో బిల్లు 2 లక్షల లోపు ఉండేలా 7 చిన్న చిన్న పనులుగా విభజించి సొంతంగా మంజూరు చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారు.
ఇతర అక్రమాల పర్వం… టెండర్లు లేని కొనుగోళ్లు
అంతటితో ఆగకుండా ఎలాంటి టెండర్లు, కోటేషన్లు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఒకే వోచర్ ద్వారా స్థానిక ఈవెంట్ మేనేజర్కు రూ. 9,00,000 గాను సీసీ కెమెరాల కొనుగోలుకు 8,89,566 రూపాయలు చెల్లించారు.
భక్తుల విరాళాలు మాయం
అలాగే కుంభాభిషేకం సందర్భంగా భక్తులు ఇచ్చిన బియ్యం, పప్పులు, వంట నూనె వంటి వస్తు రూప విరాళాలను కనీసం స్టాక్ రిజిస్టర్లో కూడా నమోదు చేయకుండా పక్కదారి పట్టించారు. భక్తుల నుండి గదుల అద్దె కింద రోజుకు రూ. 500 చొప్పున ఎలాంటి రశీదులు ఇవ్వకుండా, దేవాదాయ ఖాతాకు జమ చేయకుండా వసూళ్లు చేశారు. వాల్-పోస్టర్లు అతికించడానికి 14 వేలు, వంటచెరకు కొనుగోలుకు 12 వేలు చొప్పున ఒకే పనికి రెండుసార్లు బిల్లులు బుక్ చేసి నిధులు డ్రా చేశారు.
భక్తుల ఆగ్రహం
ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భక్తుల కానుకలు, ఆలయ నిధులను ఇంత దారుణంగా దుర్వినియోగం చేయడం స్థానికంగా భక్తులలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఈ అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సదరు అధికారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
