
విద్యా వ్యవస్థలో నూతన మార్పులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగా ఇప్పటికే పేరెంట్స్ మీటింగ్స్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రైవేట్ స్కూళ్లకు కూడా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దేందుకు అనేక కొత్త సదుపాయాలు ప్రవేశపెడుతోంది. మధ్యాహ్న భోజన పథకంలో కొత్త పదార్ధాలు వడ్డించడంతో పాటు పిల్లలకు శుభ్రత పట్ల అవగాహన కల్పించేందుకు ఇటీవల ముస్తాబు అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో విద్యార్థుల కోసం గవర్నమెంట్ స్కూళ్లల్లో మరో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్దమవుతోంది.
ప్రభుత్వ స్కూళ్లల్లో సిక్ రూమ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం స్కూల్స్లో ఒక ప్రత్యేక గది కేటాయిస్తారు. ఈ గదిలో ప్రథమ చికిత్స కిట్లు, మెడిసిన్స్, వస్తువులు ఉంటాయి. పిల్లలు ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు లేదా గాయపడ్డప్పుడు వెంటనే ఇక్కడ ప్రాథమిక వైద్య సహాయం పొందవచ్చు. ఈ రూమ్ను మెడికల్, సిక్, నర్సు ఆఫీస్గా పిలవనున్నారు. పిల్లల ఆరోగ్యానికి పెద్ద పీట వేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 600కిపైగా పాఠశాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సర్వశిక్ష అభియాన్ నిధులను వాడుకోనున్నారు. ఒక్కొ సిక్ రూమ్ కోసం సర్వశిక్ష అభియాన్ రూ.5 లక్షల చొప్పున నిధులు విడుదల చేసింది.
2026 మార్చి నాటికి ప్రభుత్వ స్కూల్స్లో వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం తొలి దశలో 600 ప్రభుత్వ స్కూల్స్లో సిక్ రూమ్స్ నెలకొల్పనుండగా.. విడతల వారీగా అన్నీ స్కూళ్లల్లో ఏర్పాటుకు సిద్దమవుతోంది. సిక్ రూమ్ ఏర్పాటు కోసం స్కూల్స్లో పెద్దగా ఉండే గదిని రెండుగా విభజిస్తారు. అందులో ఓ గదిలో ఈ సిక్ రూమ్ ఉంటుంది. స్థానిక ఆస్పత్రులతో కలిసి ఇక్కడ పిల్లలకు అరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. దీని ద్వారా పిల్లల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తారు. ఇంతేకాకుండా టీచర్లు, ఆరోగ్య నిపుణులు, తల్లిదండ్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి సిక్ రూమ్ నిర్వహణ అప్పగించన్నారు. పరిశుభ్రత, మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.