Andhra Pradesh: అర్ధరాత్రి వేళ దేవరపల్లిలో జీడిగింజల లారీ బోల్తా.. ఏడుగురు కూలీలు దుర్మరణం

|

Sep 11, 2024 | 6:34 AM

తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం (సెప్టెంబర్‌ 11) తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం మినీలారీ రూపంలో మృత్యువు ఏడుగురిని బలిగొంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. డీసీఎం క్యాబిన్లో ఉన్న మరో ఇద్దరు సురక్షితంగా ఉన్నారు. ప్రమాద సమయంలో డీసీఎంలో డ్రైవర్‌తో సహా 10 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం..

Andhra Pradesh: అర్ధరాత్రి వేళ దేవరపల్లిలో జీడిగింజల లారీ బోల్తా.. ఏడుగురు కూలీలు దుర్మరణం
Devarapalli Lorry Accident
Follow us on

దేవరపల్లి, సెప్టెంబర్‌ 11: తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం (సెప్టెంబర్‌ 11) తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం మినీలారీ రూపంలో మృత్యువు ఏడుగురిని బలిగొంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. డీసీఎం క్యాబిన్లో ఉన్న మరో ఇద్దరు సురక్షితంగా ఉన్నారు. ప్రమాద సమయంలో డీసీఎంలో డ్రైవర్‌తో సహా 11 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకెళ్తే..

ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో బయల్దేరిన డీసీఎం మినీ లారీ బుధవారం తెల్లవారు జామున రోడ్డుపై బోల్తా పడింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు వెళ్తుండగా చిన్నయగూడెం శివారు వద్ద అదుపు తప్పి పంటబోదెలోకి దూసుకువెళ్లింది. అనంతరం చెట్ల పొదల్లో బోల్తా పడింది. దీంతో వాహనం ట్రక్కులో కూర్చుని ఉన్న తొమ్మిది మంది కూలీలు వాహనం కింద పడిపోయారు. వాహనం తిరగబడటంతో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఊపిరాడక ఏడుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరిని తాడిమళ్లకు చెందిన ఘంటా మధుగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో ఏడుగురు తాడిమళ్లకు చెందిన వారిగా గుర్తించారు. సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి.చినముసలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్‌.. అనే కూలీలు ఈ ఘటనలో మృతి చెందారు.

ప్రమాదం అనంతరం డీఎస్పీ దేవకుమార్, ఎస్సైలు శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు సహాయంతో బస్తాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించారు. మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ప్రమాద సమయంలో క్యాబిన్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. వీరిలో డ్రైవర్‌ ప్రమాదం అనంతరం పరారయ్యాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.