
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఆదివారం (మే 31) ఒక ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన దృశ్యం కనిపించింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీకెండ్ సెలవు రోజు దొరకడంతో, తన అధికారిక హోదాను పక్కనబెట్టి సామాన్యుడిగా మారిపోయారు. పాలకొల్లు నుండి సుమారు ఏడు కిలోమీటర్ల దూరం ఆయనే స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ తన స్వగ్రామమైన అగర్తిపాలేనికి బయలుదేరారు. ఈ ప్రయాణంలో దారిపొడవునా ఎదురైన స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
స్వగ్రామం చేరుకున్న అనంతరం మంత్రి నిమ్మల తనకిష్టమైన వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ముందుగా తన సొంత రొయ్యల చెరువు వద్దకు వెళ్లి, రొయ్యలకు మేత వేసి వాటి ఎదుగుదలను పరిశీలించారు. ఆ తర్వాత తన సొంత పొలంలోకి దిగి, అక్కడ పనిచేస్తున్న కూలీలతో ముచ్చటించారు. స్వయంగా ట్రాక్టర్ ఎక్కి పొలాన్ని దున్నారు. శ్రమజీవులైన కార్మికులతో కలిసి మమేకమై పనిచేయడం తనకు ఎంతో ఆనందాన్ని, మానసిక సంతృప్తిని ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన పంచుకున్నారు.
వ్యవసాయ పనుల్లో పాల్గొంటూనే రైతులకు ఆయన ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఆదివారం గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేశామని మంత్రి ప్రకటించారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులందరూ ముందస్తుగా వరి నాట్లు వేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, సాగునీటిని వృధా చేయకుండా, సక్రమంగా వినియోగించుకుంటూ జల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఓ పక్క మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోపక్క మట్టి మనుషులతో కలిసి వ్యవసాయం చేసిన నిమ్మల రామానాయుడి తీరు స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..