
ఒక రాయల్ బెంగాల్ టైగర్.. పది నెలలుగా పెద్ద పులి సంచారం.. పంజా విసిరి పశువులను చంపుతున్నా.. పులిని బంధించలేకపోతున్న అటవీ శాఖ. ఇది ఓవరాల్గా విజయనగరం జిల్లాలో నెలకొన్న పరిస్థితి. పశువుల వేటకు కాస్త విరామం ప్రకటించిన పెద్దపులి మళ్లీ ఫామ్లోకి వచ్చినట్టుంది. మెంటాడ మండలం వనిజ గ్రామంలోని జీడి తోటలో ఓ ఎద్దుపై దాడి చేసి చంపేసింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కంటిపై కునుకు లేకుండా పోయింది. పులి ఎటు నుంచి దాడి చేస్తుందోననే భయంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. పది గ్రామాల్లో ఇదే పరిస్థితి.
పులి దాడిలో ఎద్దు మృతి చెందడంతో రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానిక అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు వారి అనుమానం. అటవీశాఖ అధికారులు పాదముద్రలు సేకరించారు. జాగ్రత్తగా ఉండాలని పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికి పలు పశువులను పులి చంపేసిందని.. ఇప్పటివరకు ఎందుకు బంధించలేకపోతున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
పులి జాడలు తెలుస్తున్నా ఎందుకు బంధించలేకపోతున్నారని గ్రామస్తుల ప్రశ్న. ఇంకెన్ని ఆవులు, ఎద్దులు మృత్యువాత పడాలని నిలదీస్తున్నారు. మనుషులపై దాడి చేస్తుందనే భయం వారిని వెంటాడుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..