
ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏలూరు, భీమవరం, పాలకొల్లు, కాళ్ళ, ఉండి, పాలకోడేరు, గణపవరం నిడమర్రు మండలాల్లో పెద్ద ఎత్తున కొళ్ల పందేలకు ఏర్పాటు చేస్తున్నారు నిర్వహకులు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కోడి పందేలకు సిద్దమవుతున్నారు పందెం రాయుళ్లు. జిల్లా వ్యాప్తంగా సుమారు 200 పైగా పందెం బరులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రముఖ పట్టణాల్లో హోటళ్లు లాడ్జిలు హౌస్ ఫుల్ అయిపోయాయి. పందేల పట్ల ఆసక్తిగలవారు పండుగకు వారం రోజుల ముందు నుంచే లాడ్జిలను బుక్ చేసుకున్నారు. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు విలువైన వస్తువులు బహుమతులుగా ఇస్తున్నారు. మెట్టప్రాంతం జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, లింగపాలెం, చింతలపూడి, ద్వారకాతిరుమల మండలాల్లో ఇప్పటికే బరులను సిద్దం చేశారు.
ఇదిలా ఉంటే ఎలాంటి పందేలకు అనుమతులు లేవని చెబుతున్నారు పోలీసులు. ఇప్పటికే పలు పందెం బరులను ధ్వంసం చేశారు పోలీసులు. గతంలో పందేలు వేసిన వారిపై నేటికి బైండోవర్ కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. జంతువులను హింసించడం చట్టపరంగా నేరమని, ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. అయితే పోలీస్ హెచ్చరికలను లెక్కచేయని పందెం రాయుళ్లు ఈ సంక్రాంతికి ఫుల్ జోష్ నింపేందుకు తమ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి పందెం కాసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు పందెరాయుళ్లు. ఏపీలోని పలు జిల్లాల నుంచే కాకుండా.. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ సంబరాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..