
విజయవాడ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అమృత్ భారత్ పథకం కింద సరికొత్త హంగులతో రాయనపాడు రైల్వే స్టేషన్ ముస్తాబయింది. విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్లో రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్గా తీర్చిదిద్దేందుకు.. ఎంపీ కేశినేని చిన్ని ప్రత్యేక చొరవతో రూ.35 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ఆధునీకరణ పనులు ఇటీవలే వంద శాతం పూర్తవడంతో.. ఈ నెల 17న స్టేషన్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది.
దేశంలోని రైల్వే స్టేషన్లను ప్రపంచస్థాయి వసతులతో తీర్చిదిద్దాలనే ప్రధాని మోదీ సంకల్పానికి ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ నిదర్శనంగా నిలుస్తోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నిరంతర పర్యవేక్షణ, కేంద్ర రైల్వే శాఖ అధికారులతో జరిపిన సమన్వయంతో.. అమృత్ భారత్ పథకం కింద చేపట్టిన ఆధునీకరణ పనులు రికార్డు స్థాయిలో పూర్తయ్యాయి. దాదాపు 35 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ స్టేషన్ను హైటెక్ హంగులతో సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ప్లాట్ఫారమ్-1 ను 670 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పుతో పూర్తిగా ఆధునీకరించారు. ప్రయాణికులు ఎండ, వానల నుండి ఇబ్బంది పడకుండా ఉండేందుకు రూ.6.38 కోట్లతో 340 మీటర్ల పొడవైన కొత్త ప్లాట్ఫారమ్ షెల్టర్లను నిర్మించారు.
ప్రయాణికుల సౌకర్యం కోసం రూ.5.77 కోట్ల వ్యయంతో 192 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్, మోడ్యులర్ టాయిలెట్ కాంప్లెక్స్ను అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లపై రెండు సరికొత్త లిఫ్టులను ఏర్పాటు చేయడంతో పాటు.. నడవడానికి వీలుగా టాక్టైల్ పాత్ను కూడా సిద్ధం చేశారు.
ఈ రైల్వే స్టేషన్కు మరో ప్రధాన ఆకర్షణ.. మన సంస్కృతిని ప్రతిబింబించే కొండపల్లి బొమ్మల పెయింటింగ్స్. స్టేషన్ లోపల, బయట వేసిన ఈ చిత్రాలు ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు విశాలమైన పార్కింగ్ ప్లేస్, ల్యాండ్స్కేపింగ్ గ్రీనరీ, అధునాతన లైటింగ్తో స్టేషన్ పరిసరాలు సరికొత్త రూపును సంతరించుకున్నాయి.
త్వరలోనే ఈ స్టేషన్ మీదుగా ప్రతిరోజు 12 రైళ్ల రాకపోకలు సాగనున్నాయి. ఇందులో కొన్ని కీలకమైన ఎక్స్ప్రెస్ రైళ్లకు కూడా హాల్టింగ్ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో విజయవాడకు ఇదొక అత్యంత కీలకమైన రైల్వే హబ్గా మారబోతోంది. ఈ నెల 17వ తేదీన జరగబోయే గ్రాండ్ ఓపెనింగ్ కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.