
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల, ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో నేడు, రేపు వర్షాలు పడే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. శనివారం, ఆదివారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని స్పష్టం చేసింది. అలాగే కొన్ని జిల్లాల్లో పిడుగులు పడతాయని అంచనా వేసిన వాతావరణశాఖ అధికారులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వానలు కురవగా.. రాబోయే రెండు రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం.
శనివారం విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కడప, తిరుపతి, చిత్తూరు, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్టా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, శ్రీసత్యసాయి, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో వానలు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇక ఆదివారం గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, ఎన్టీఆర్, కృష్టా, అనంతపురం, శ్రీసత్యసాయి, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, పిడుగులు పడతాయని హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా వాతావరణం పూర్తిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. మరికొద్ది ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎండల నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే వర్షాలు దంచికొట్టాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకోవడంతో ప్రజలు ఎండ ప్రభావానికి ఇబ్బందులు పడుతున్నారు. భానుడి ప్రతాపంతో పాటు ఉక్కబోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాబోయే రెండు నెలల పాటు ఎండలు మరింత పెరగనున్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది.