
ఆంధ్రప్రదేశ్కు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం రాష్ట్రానికి భారీ వర్షసూచన జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకగా.. అన్ని ప్రాంతాలకు క్రమక్రమంగా విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మేఘవృతమైన వాతావరణంతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశముందని స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపలుు పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద ఉండొద్దని, అలాగే భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని ఆయన సూచించారు. ఈ సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. భారీ వర్షాల క్రమంలో బయటకు రావొద్దని సూచించారు.
ఆదివారం శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణశాఖ స్పష్టం చేసింది. మిగతా 23 జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపింది. అయితే శనివారం సాయంత్రం 6 గంటల నాటికి మార్కాపురం జిల్లా కోవిలంపాడులో 41మిమీ, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 24మిమీ, వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురంలో 22.5 మిమీ వర్షపాతం రికార్డైందని ప్రఖర్ జైన్ చెప్పారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.
నైరుతి రుతువపనాల రాకతో ఏపీలో విస్తారంగా వానలు పడుతున్నాయి. ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్లు జలమయడం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడుతుండటంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. నైరుతి రుతుపవనాలు ఇప్పుడే మొదలుకావడంతో రానున్న కొద్ది నెలల పాటు వర్షాలు బీభత్సం సృష్టించే అవకాశముంది.