
Rain Alert for AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి.. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. ఖరీఫ్ సీజన్ మొదలైన నాటి నుంచి వర్షాలు కురవడం లేదు.. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు సైతం భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వచ్చే రెండు రోజులు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం.. పశ్చిమ, నైరుతి గాలులు, రుతుపవనాల ప్రభావం రాష్ట్రంలో రెండు రోజులపాటు ఉంటాయని చెప్తున్నారు అధికారులు. ఇవాళ, రేపు ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, తిరుపతి జిల్లాలతోపాటు చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. నిన్న రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా రామాపురంలో 3.1 సెం.మీ., తిరుపతి జిల్లా అరణ్యకండ్రిగ, నంద్యాల జిల్లా చిలకలూరు, అనంతపురం జిల్లా చిటికలపల్లె 2.7, సత్యసాయి జిల్లా గోరంట్లలో 2.4, ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో 2.3 సెం.మీ.చొప్పున వర్షపాతం నమోదైంది.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగిలిన జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉంది.
~ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ pic.twitter.com/gFOm802Zgv— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) August 26, 2023
మరోవైపు అల్లూరి జిల్లా ఏజెన్సీలో పలుచోట్ల దట్టంగా పొగ మంచు కురుస్తుంది. కొండలు, రోడ్లను మంచు ముసుగు కమ్మేసింది. పాడేరు- వంజంగి కొండల మధ్య పొగమంచు పాల సముద్రాన్ని తలపించింది. పొగమంచును పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు.
తెలంగాణలో రానున్న మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడన ద్రోణీ కారణంగా ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..