
ఏపీలోని ప్రజలకు పోస్టల్ శాఖ శుభవార్త అందించింది. ఇకపై 24 గంటల పాటు ఎప్పుడైనా పోస్టల్ సేవలు పొందవచ్చు. రాష్ట్రంలోని 11 నగరాల్లో 24/7 పోస్టల్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. విశాఖపట్నంతో పాటు విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, గుంతకల్లు సిటీల్లో నిరంతర పోస్టల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు పోస్టల్ శాఖ అధికారులు తాజాగా ఈ సేవను ప్రారంభించగా.. ప్రజలందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఇక నుంచి 24 గంటల పాటు ప్రజలు స్పీడ్ పోస్టులు, పార్సిల్స్ పోస్టల్ శాఖ ద్వారా పంపించుకోవచ్చు. పని వేళలతో సంబంధం లేకుండా ఎప్పుడైనా సేవలు పొందవచ్చు. రాత్రి వేళల్లో కూడా అత్యవసరంగా ఏదైనా పంపించాలంటే వెంటనే పంపించవచ్చు.
ఇక ఏపీవ్యాప్తంగా ఉన్న 242 పట్టణాల్లో పోస్టాఫీస్ పనివేళల్లో మార్పులకు పోస్టల్ శాఖ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న పనివేళలను 1 నుంచి 2 గంటల పాటు పొడిగించారు. దీని వల్ల ప్రజలకు మరింతగా పోస్టల్ శాఖలు అందనున్నాయని అధికారులు తెలిపారు. 24 గంటల సేవలతో పాటు పనివేళల పెంపు నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పటివరకు పోస్టాఫీస్ పనివేళల్లోనే స్పీడ్ పోస్టులు లేదా పార్సిల్స్ బుకింగ్ చేసుకునే సదుపాయం ఉండేది. కానీ ప్రజలకు నిరంతరం సేవలు అందించేందుకు పోస్టల్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా సాంకేతికతను కూడా ఉపయోగించుకుంటోంది. ఇటీవల పోస్టల్ శాఖకు సంబంధఇంచిన ఐటీ 2.0 సాప్ట్వేర్ను జీపీవో, సబ్ పోస్ట్ ఆఫీసులకు లింక్ చేశారు. దీంతో పోస్టల్ సేవల్లో వేగం పెరిగింది.
ఇక ఇప్పటివరకు పోస్ట్ మన ఇంటికి వచ్చినప్పుడు మనం అందుబాటులోకి లేకపోతే పోస్టల్ సిబ్బంది వెనక్కి తీసుకెళ్తారు. మనం మళ్లీ పోస్టాఫీసుకు వెళ్లి దీనిని తీసుకోవాల్సి ఉంటుంది. దూరపు ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇంటికి పోస్ట్ వచ్చినప్పుడు, ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఇబ్బంది అవుతుంది. దీనిని పరిష్కరించేందుకు ఏటీఎంలను పోస్టల్ శాఖ అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా మీరు నెంబర్ ఎంటర్ చేసి మీ పోస్ట్ తీసుకోవచ్చు. హైదరాబాద్లోని కొన్ని సర్కిళ్లల్లో ఇలాంటి తరహా ఏటీఎంలను పోస్టల్ శాఖ ఇటీవల ప్రవేశపెట్టింది. రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే పోస్టాఫీస్కు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది.