
త్వరలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న.. వందేభారత్ రైలుపై విశాఖలో రాళ్ల దాడి జరిగింది. కంచరపాలెంలోని రామ్మూర్తి పంతులు గేట్ దగ్గర దుండగులు దాడి చేయడంతో.. రెండు కోచ్లకు సంబంధించిన అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నెల 15న ప్రధాని మోదీ వర్చువల్గా వందేభారత్ రైలు ప్రారంభించాల్సి ఉంది. ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి రైలు వచ్చింది. అనూహ్యంగా వెర్షన్ 2 వందే భారత్ రైలు బోగీలపై దాడి జరిగింది. ఈ దాడి కేసులో కీలకంగా సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. శంకర్, దిలీప్, చందు అనే వ్యక్తులను అనుమానితులుగా గుర్తించారు. మద్యం మత్తులో రాళ్లు రువ్వారా లేక వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో నిందితులను అరెస్ట్ చేస్తామంటున్నారు పోలీసులు.
విశాఖలో వందే భారత్ ట్రైన్పై రాళ్లు రువ్విన ఘటనను రైల్వేతో పాటు ఇటు నగర పోలీస్ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే ఇదే ట్రైన్ను ఈ నెల 15న ప్రధాని మోదీ వర్చ్యువల్గా ప్రారంభించాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ట్రయల్ రన్ కోసం వచ్చి రైల్వే కోచ్ కేర్ సెంటర్కు వెళ్తోంది. ఈ క్రమంలో కనీస జాగ్రత్తలు తీసుకులేకపోయినట్లుగా ఈ వివాదం ఆర్పీఎఫ్, జీ అర్ పి పోలీసుల మెడకు చుట్టుకుంది. దీని వెనుక విద్రోహక శక్తుల కుట్ర ఉందేమో ఆన్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అనుమానాలతో పోలీసులపై మరింత ఒత్తిడి పెరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. వీరికోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న మోదీ సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ ప్రారంభించాల్సి ఉండగా.. 4 రోజుల ముందుగానే ప్లాన్ చేశారు. ఈలోపు ఇదే ట్రైన్ ట్రయల్ రన్ కోసం చెన్నై ఇంటిగ్రేటెడ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి నేరుగా విశాఖ వచ్చింది. ఇవాళ విశాఖ నుంచి సికింద్రాబాద్కు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంది. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో సాధారణ మెయింటెనెన్స్ కోసం కోచ్ కేర్ సెంటర్ కు తరలిస్తున్న సందర్భంలో కంచరపాలం సమీపంలో రామ్మూర్తి పంతులు గేటు వద్ద కొందరు అగంతకులు ట్రైన్ పైకి రాళ్ళు విసిరారు. దీంతో ఒక కోచ్ కు చెందిన రెండు గ్లాస్ లు పగిలిపోయాయి. ఈ ఘటనతో నగర పోలీస్ అధికారులు షాక్కు గురయ్యారు.
నిందితుల ఆనవాళ్లు గుర్తించగా నిరంతరం అక్కడ తిరిగే శంకర్, దిలీప్, చందులుగా పోలీసులు తేల్చారు. నిందితులపై గతంలో కూడా హత్యాయత్నం, పలు రైల్వే కేసులు ఉన్నట్లు గుర్తించారు. గంజాయి మత్తులో చేశారా, లేక ఉద్దేశపూర్వకంగా చేశారా అన్నది విచారణలో తేలుతుందని అంటున్నారు పోలీసులు. దుశ్చర్యకు పాల్పడ్డ వాళ్లు దేశ ద్రోహులు అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..