
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పుందా? అన్న సామెత నెల్లూరు నగర శివార్లలో అక్షరాలా నిజమైంది. ప్రమాదంలో చిక్కుకున్న లారీ డ్రైవర్ను కాపాడటం పక్కన పెట్టి, రోడ్డుపై పడిన కూల్ డ్రింక్ బాటిళ్ల కోసం జనం ఎగబడ్డ తీరు చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై బుజబుజ నెల్లూరు సమీపంలో కూల్ డ్రింక్ బాటిళ్ల లోడ్తో వెళ్తున్న ఒక భారీ లారీ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. డివైడర్ను బలంగా ఢీకొట్టి రోడ్డుపై బోల్తా పడింది. లారీలో ఉన్నవన్నీ 2 లీటర్లు, 2.5 లీటర్ల ప్లాస్టిక్ బాటిళ్లు కావడంతో, ప్రమాదం జరిగిన ధాటికి బాటిళ్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు డ్రైవర్ క్షేమసమాచారం అడుగుతారని భావిస్తే, సీన్ రివర్స్ అయింది. రోడ్డుపై పడి ఉన్న బాటిళ్లను చూసిన జనం తమ చేతులకు పని చెప్పారు. స్థానికులే కాదు, అటుగా కార్లు, బైకులపై వెళ్తున్న వారు కూడా వాహనాలు ఆపి మరీ బాటిళ్లను ఎత్తుకెళ్లారు. కొందరైతే కార్ల డిక్కీలు నిండుగా బాటిళ్లను నింపుకుని దర్జాగా వెళ్ళిపోయారు. రోడ్డుపై పడినవే కాకుండా లారీ పైకి ఎక్కి మరీ లోపల ఉన్న బాటిళ్లను అందినకాడికి దోచుకెళ్లారు. లోడ్ నిండా ఉన్న సరుకంతా కేవలం అరగంటలోపే మాయమైపోయింది.
లారీ బోల్తా పడి ట్రాఫిక్ జామ్ అయి ఉంటుందని భావించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక వారికి ఆశ్చర్యం కలిగింది. రోడ్డుపై లారీ అయితే ఉంది కానీ, ఒక్క బాటిల్ కూడా కనిపించలేదు. జనం పుణ్యమా అని రోడ్డు క్లీన్ అయిపోవడంతో ట్రాఫిక్ సమస్య కూడా లేకుండా పోయింది. దీంతో పోలీసులు లారీని తొలగించి అక్కడి నుంచి వెనుతిరిగారు.