Andhra Pradesh: కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త.. త్వరలోనే దరఖాస్తులు.. ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే..
ఏపీ ప్రభుత్వం త్వరలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. దీంతో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూసేవారికి ఇది శుభవార్తగా చెప్పవచ్చు. అయితే పింఛన్ల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? ఎవరిని సంప్రదించాలి? అనే విషయం చాలామందికి తెలియదు. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా సామాజిక పింఛన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. వృద్దులు, దివ్యాంగులు, వికలాంగులు, వితంతువులు, గీత, చేనేత కార్మికులకు ప్రతీ నెలా పింఛన్ అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ప్రతీ నెలా ఒకటో తేదీన అధికారులు నేరుగా ఇంటికి వెళ్లి పింఛన్ సొమ్ము అందిస్తున్నారు. 1వ తేదీన సండే లేదా సెలవు దినం వస్తే ముందు రోజే పంపిణీ చేస్తున్నారు. 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు పంపిణీ జరుగుతుంది. వృద్దులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు అందిస్తున్నారు. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి కూడా పింఛన్ అందిస్తున్నారు. ఏపీ గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా ఈ పథకం అమలు జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం త్వరలోనే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది చూద్దాం.
ఎవరు అర్హులు..?
వృద్దులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, మత్య్సకారులు, ట్రాన్స్జెండర్లు, డప్పు కళాకారులు, డయాలసిస్ పేషెంట్లు దీనికి అర్హులు.
అర్హతలు ఏంటి..?
గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ నెల ఆదాయం రూ.10 వేలోపు ఉండాలి. ఇక పట్టణాల్లో రూ.12 వేలలోపు ఉండాలి. కుటుంబానికి పోలం 10 ఎకరాల్లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువ భూమి కలిగి ఉంటే అనర్హులు. కారు లాంటి లగ్జరీ వాహనాలు కలిగి ఉండకూడదు. కరెంట్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఉండకూడదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే పింఛన్ వస్తుంది.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
ఆధార్, రేషన్ కార్డుతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ అప్డేట్ హిస్టరీ అందించాలి. ఇక వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్ సమర్పించాలి. ముందుగా సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మీకు వైకల్యం ఉందని నిర్ధారణ చేశాక సదరం సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సర్టిఫికేట్ తీసుకెళ్లి వికలాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఎలా..?
గ్రామ, వార్డు సచివాలయంకు వెళ్లాలి. దరఖాస్తు ఫారం నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లను జత చేయాలి. అనంతరం అధికారులు పరిశీలించి పింఛన్ మంజూరు చేస్తారు. ఇక దరఖాస్తు స్టేటస్ తెలుసుకునేందుకు గ్రామ, వార్డు సచివాలయం అధికారులను సంప్రదించాలి. ఇక జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఇక ఇతర వివరా కోసం 08662410017 నెంబర్ను సంప్రదించాలి. ఇక https://sspensions.ap.gov.in ద్వారా ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు.
