గర్భంతో ఉన్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఊహించ‌ని విషాదం.. దంపతుల దుర్మ‌ర‌ణం

|

Jun 01, 2021 | 10:30 AM

క‌రోనాను జ‌యించిన ఈ న‌వ‌దంప‌తుల‌పై విధి ప‌గ‌బ‌ట్టింది. గుర్తుతెలియని వాహనం రూపంలో వారిని అనంతలోకాల‌కు తీసుకెళ్లింది. పెళ్లయిన ఆరు నెలలకే.. ఈ జంట జీవితం...

గర్భంతో ఉన్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఊహించ‌ని విషాదం.. దంపతుల దుర్మ‌ర‌ణం
Road Accident
Follow us on

క‌రోనాను జ‌యించిన ఈ న‌వ‌దంప‌తుల‌పై విధి ప‌గ‌బ‌ట్టింది. గుర్తుతెలియని వాహనం రూపంలో వారిని అనంతలోకాల‌కు తీసుకెళ్లింది. పెళ్లయిన ఆరు నెలలకే.. ఈ జంట జీవితం ముగిసిపోయింది. గర్భిణి అయిన భార్యను కాలు కింద పెట్ట‌కుండా చూసుకోవాల‌న్న‌ అతని తపన, పండంటి బిడ్డను కని సంతోష‌క‌ర‌మైన దాంప‌త్య జీవితం గ‌డ‌పాల‌న్న‌ ఆమె కోరికలను చిదిమేసింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ఈ క‌న్నీరు పెట్టించే ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం చిట్టివలసకు చెందిన రౌతు యోగేశ్వరరావు(27), రోహిణి(22) దంపతులు సోమవారం ద్విచ‌క్ర‌వాహ‌నంపై వైజాగ్ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో దంపతులిద్దరూ స్పాట్‌లోనే చ‌నిపోయారు. రైల్వేలో కళాసీగా పనిచేసే యోగేశ్వరరావు రోజూ రైల్లోనే ఇంటి నుంచి వ‌ర్క్ కోసం వెళ్లొచ్చేవాడు. అయితే రోజూ అంతదూరం రాకపోకలు సాగించడం ఇబ్బందిగా ఉండ‌టంతో రెండు నెలల క్రితమే కంచరపాలెంలో ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ భార్య‌తో క‌లిసి ఉంటున్నాడు.

నరసన్నపేటకు చెందిన రోహిణి ఏడేళ్ల క్రితం నాన్న‌ను కోల్పోయింది. యోగేశ్వరరావు తండ్రి మూడేళ్ల క్రితం చ‌నిపోవ‌డంతో ఇద్దరూ నాన్న ప్రేమకు దూరమయ్యారు. పెళ్లయ్యాక మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా సాగుతున్న తరుణంలో కోవిడ్ బారిన‌ప‌డ‌టంతో ఇద్దరూ ఇంట్లోనే ఉండి క్రమం తప్పకుండా మెడిసిన్ వాడుతూ కోలుకున్నారు. భార్య రోహిణి నీరసంగా ఉందని చెప్పడంతో చిట్టివలసలో తల్లి వద్ద ఉంచాడు. రెండు రోజుల క్రితమే భార్య గర్భిణి అని తెలిసి యోగేశ్వరరావు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దగ్గరుండి బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో వైజాగ్‌ తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
కొద్ది రోజులు అక్కడే ఉంచి ఆసుపత్రిలో చూపించి, వారంలో తిరిగి వస్తానమ్మా అంటూ తల్లికి చెప్పి భార్యతో కలిసి బైక్‌పై వైజాగ్‌ బయలుదేరాడు. కనిమెట్ట పైవంతెన వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి ఓ గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో అదుపుతప్పిన బైక్ డివైడర్‌ను బైక్‌ బలంగా ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రగాయాలతో మ‌ర‌ణించారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యామిలీ మెంబ‌ర్స్, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు ఇద్దరి డెడ్‌బాడీల‌ను పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట సామాజిక ఆసుపత్రికి తరలించారు.

Also Read:  తెలంగాణ రేషన్ కార్డుదారులకు స‌ర్కార్ గుడ్ న్యూస్.. వివ‌రాలు ఇలా ఉన్నాయి

ఇండియాలో కొత్త‌గా 1,27,510 క‌రోనా కేసులు, యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా