NDA ఎంట్రన్స్ పరీక్షలో మెరిసిన నంద్యాల కుర్రోడు.. ఎన్నో ర్యాంక్ అంటే..

పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు అని నిరూపించాడు నంద్యాల జిల్లా యువకుడు. కఠోర శ్రమ ద్వారా నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సెలెక్ట్ అవడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ అతను ఏం సాధించాడు..? ఎందులో ప్రతభ కనబరిచాడు.. పూర్తి వివరాలు కథనంలో ...

NDA ఎంట్రన్స్ పరీక్షలో మెరిసిన నంద్యాల కుర్రోడు.. ఎన్నో ర్యాంక్ అంటే..
Kovidh Reddy

Edited By:

Updated on: Apr 22, 2026 | 12:26 PM

నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తత్తూరు గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విశ్వనాథరెడ్డి – మాధవి దంపతులు ప్రస్తుతం కర్నూలు ధర్మపేటలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు కోవిద్ రెడ్డి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో 46వ ర్యాంకు సాధించి ప్రతిభ చాటాడు. పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించాడు. కోవిద్ రెడ్డి మొదటి తరగతి నుంచి 8వ తరగతి వరకు సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో చదివాడు. అదే సమయంలో కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశాల ప్రకటన చూసి దరఖాస్తు చేసుకుని, కేవలం రెండు నెలల కోచింగ్‌తో విజయనగరం కోరుకొండ సైనిక్ స్కూల్‌లో ప్రవేశం సాధించాడు.

9వ తరగతి నుంచి ఇంటర్ వరకు అక్కడే విద్యాభ్యాసం కొనసాగిస్తూ, ఎన్డీఏకి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు యూపీఎస్సీ ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహించే ఎన్డీఏ ప్రవేశ పరీక్షలో లక్షలాది మంది పోటీ పడుతుంటారు. అలాంటి కఠిన పోటీ మధ్య కోవిద్ రెడ్డి జాతీయ స్థాయిలో 46వ ర్యాంక్ సాధించడం విశేషం. ఈ ఏడాది జూలైలో ఆయన ఇండియన్ నేవీలో శిక్షణకు హాజరుకానున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శనం, తన కఠోర శ్రమ వల్లే ఈ విజయాన్ని సాధించానని కోవిద్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో నేవీలో కూడా ప్రతిభ కనబరిచి దేశానికి సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

Also Read: అప్పు వెంటనే కట్టాలని వేధిస్తున్నారా..? ఈ ఒక్కటి చేస్తే మీ జోలికి అస్సలు రారు..

 

 

Follow Us