అప్పు వెంటనే కట్టాలని వేధిస్తున్నారా..? ఈ ఒక్కటి చేస్తే మీ జోలికి అస్సలు రారు..
అప్పులు తీర్చడంలో జాప్యం జరిగినప్పుడు అప్పులిచ్చిన వారు ఇంటికి వచ్చి వేధించడం, బెదిరించడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రుణగ్రహీతలు సివిల్ కోర్టు ద్వారా "ఇంజక్షన్ ఆర్డర్" పొందవచ్చు. ఈ ఆర్డర్ అప్పులిచ్చిన వారు వేధించకుండా, ఇంటికి రాకుండా లేదా ఫోన్ చేయకుండా నిరోధించి, అప్పు తీర్చడానికి అవసరమైన సమయాన్ని అందిస్తుంది.

ఆర్థిక పరిస్థితులు, వ్యాపార నష్టాలు లేదా అనారోగ్యం వంటి అనేక కారణాల వల్ల అప్పులు తీర్చడంలో జాప్యం జరగడం సర్వసాధారణం. అయితే, అప్పులు తీర్చడానికి సమయం కావాలని కోరినప్పటికీ, కొందరు అప్పులిచ్చిన వారు రుణగ్రహీతలను తీవ్రంగా వేధిస్తుంటారు. ఇంటికి వచ్చి కూర్చోవడం, పది మందిని తీసుకొచ్చి గొడవ చేయడం, ఇంట్లో వస్తువులు ఎత్తుకెళ్తామని బెదిరించడం, ఫోన్ల ద్వారా నిరంతరం వేధించడం, లేదా సమాజంలో పరువు తీయడం వంటి చర్యలకు పాల్పడుతుంటారు. ఈ ఒత్తిడి కారణంగా రుణగ్రహీతలు ఆత్మహత్యలు, పారిపోవడం, ఆస్తులను తక్కువ ధరకు అమ్ముకోవడం వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో రుణగ్రహీతలకు న్యాయపరమైన రక్షణ ఉంటుందని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. అప్పులు తీర్చడానికి కొంత సమయం కావాలని భావించేవారు సివిల్ కోర్టును ఆశ్రయించి “ఇంజక్షన్ ఆర్డర్” (Injunction Order) పొందవచ్చు.
ఈ ఆర్డర్ ద్వారా అప్పులిచ్చిన వ్యక్తులు రుణగ్రహీతను నేరుగా గానీ, ఫోన్ ద్వారా గానీ వేధించకుండా, ఇంటికి గానీ, పని ప్రదేశానికి గానీ రాకుండా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తుంది. ఇంజక్షన్ ఆర్డర్ పొందడానికి, రుణగ్రహీత కోర్టులో తాను అప్పు తీసుకున్న విషయాన్ని, ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల సకాలంలో తీర్చలేకపోతున్న విషయాన్ని, భవిష్యత్తులో తీర్చగల సామర్థ్యం ఉన్నందున కొంత సమయం ఇవ్వాలని విన్నవించాలి. అప్పును తిరిగి చెల్లించడానికి సమయం ఇస్తే కట్టడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలియజేయాలి. ఈ కేసును బట్టి, కోర్టు అప్పు మొత్తాన్ని బట్టి ఇంజక్షన్ ఆర్డర్ సాధారణంగా ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. ఒకసారి ఇంజక్షన్ ఆర్డర్ జారీ అయితే, కేసు ముగిసే వరకు అది అమలులో ఉంటుంది. ఈ ఇంజక్షన్ ఆర్డర్ ద్వారా రుణగ్రహీతలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అప్పు తీర్చడానికి అవసరమైన సమయం దొరకడంతో, వారు తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోడానికి లేదా కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
ఇది లక్ష రూపాయల నుంచి ముప్పై కోట్ల రూపాయల వరకు ఎంత మొత్తంలో ఉన్న అప్పులకైనా వర్తిస్తుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల విషయంలో కూడా ఈ న్యాయపరమైన రక్షణ పొందవచ్చు. ఈ చట్టపరమైన మార్గాన్ని ఉపయోగించుకోవడం వల్ల రుణగ్రహీతలు గౌరవంగా జీవించగలరని, అప్పుల వేధింపుల నుండి విముక్తి పొందగలరని న్యాయనిపుణులు సలహా ఇచ్చారు.
Also Read: Anantha Sriram: ‘ఆ పాట 100 మిలియన్ కొట్టింది.. రాయల్టీనే రూ.19 లక్షలు వచ్చింది’
