ఎన్టీఆర్ జిల్లాలో విజృంభిస్తున్న వింత వ్యాధి.. చూస్తుండగానే కుప్పకూలిపోతున్న జనం..!

చూస్తుండగానే జనం ఒక్కొక్కరుగా కూలిపోతున్నారు. రాత్రి వరకు బాగున్న వాళ్లు.. తెల్లవారేసరికి వాంతులు, విరోచనాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. చందాపురంలో మొదలైన ఈ అలజడి.. ఇప్పుడు నందిగామ పట్టణాన్ని కూడా చుట్టేసింది. అధికారులు హోటళ్లు మూయించారు, మాంసం అమ్మకాలు ఆపించేశారు.. అయినా బాధితులతో ఆసుపత్రులు నిండిపోతుంటే జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాగే నీరు కలుషితమైందా..? లేక తినే ఆహారం విషమైందా?

ఎన్టీఆర్ జిల్లాలో విజృంభిస్తున్న వింత వ్యాధి.. చూస్తుండగానే కుప్పకూలిపోతున్న జనం..!
Nandigama Diarrhea

Updated on: Apr 02, 2026 | 8:01 AM

చూస్తుండగానే జనం ఒక్కొక్కరుగా కూలిపోతున్నారు. రాత్రి వరకు బాగున్న వాళ్లు.. తెల్లవారేసరికి వాంతులు, విరోచనాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. చందాపురంలో మొదలైన ఈ అలజడి.. ఇప్పుడు నందిగామ పట్టణాన్ని కూడా చుట్టేసింది. అధికారులు హోటళ్లు మూయించారు, మాంసం అమ్మకాలు ఆపించేశారు.. అయినా బాధితులతో ఆసుపత్రులు నిండిపోతుంటే జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ గడపను అంతుచిక్కని అనారోగ్య సమస్య వణికిస్తోంది. చందాపురం గ్రామంలో మొదలైన అలజడి.. ఇప్పుడు నందిగామ పట్టణాన్ని చుట్టేసింది. ఒక్కొక్కరుగా జనం మంచాన పడుతున్నారు. వాంతులు.. విరోచనాలతో బాధితులు విలవిలలాడుతున్నారు. మొదట్లో ఒకరిద్దరితో మొదలైన ఈ అస్వస్థత.. చూస్తుండగానే ఊరంతా పాకింది. ప్రస్తుతం ఈ సంఖ్య 60కి చేరింది. బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి తీవ్రమవుతుండటంతో యంత్రాంగం అత్యవసర చర్యలు చేపట్టింది. చందాపురం గ్రామంలో మాంసం విక్రయాలను పూర్తిగా నిలిపివేశారు. నందిగామ పట్టణంలోని హోటల్స్, కర్రీ పాయింట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు సహా అనేక ఆహార దుకాణాలను తాత్కాలికంగా మూసివేశారు. ప్రజలు బయట ఆహారం తీసుకోవద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు.

అస్వస్థతకు గల అసలు కారణాలను గుర్తించేందుకు ఆహార పదార్థాలు, తాగునీటి శాంపిల్స్ సేకరించి ల్యాంబ్‌కు పంపించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. గ్రామం, పట్టణాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. లక్షణాలు కనిపించిన వారిని వెంటనే గుర్తించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోంది.

ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ శుద్ధి చేసిన తాగునీరు మాత్రమే వినియోగించాలని.. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని.. బయట ఆహారం పూర్తిగా నివారించాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు. చందాపురం నుంచి నందిగామ వరకు ఈ అనారోగ్య సమస్యలు వణికిస్తున్నాయి. శాంపిల్స్ రిపోర్ట్ వస్తేనే అసలు కారణం తెలిసే అవకాశం ఉంది. అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి..

Follow Us