AP News: ఓరీ దేవుడా.. కట్టెల కోసం కొండపైకి వెళ్తే.. తల్లీబిడ్డలను కందిరీగలు మింగేశాయి

| Edited By: Ram Naramaneni

Oct 26, 2024 | 12:50 PM

కందిరీగల దాడిలో తల్లీ బిడ్డ మృతి చెందిన విషా ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. కట్టెల కోసం కొండపైకి వెళ్లిన తల్లీ కూతురుపై కందిరీగలు దాడి చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికులు గుర్తించి.. ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

AP News: ఓరీ దేవుడా.. కట్టెల కోసం కొండపైకి వెళ్తే.. తల్లీబిడ్డలను కందిరీగలు మింగేశాయి
Bee (Representative image)
Follow us on

మృత్యువు ఏ నిమిషంలో ఎటు నుంచి ఎవరిని ఆవహిస్తుందో ఎవరూ ఊహించలేరు. అల్లూరి ఏజెన్సీలో తల్లీబిడ్డలను కందిరీగల రూపంలో మృత్యువు కబళించింది. ఇద్దరి ప్రాణాలు మింగేసింది. డుంబ్రిగూడ మండలం జోడిగూడ గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కిల్లో ఊర్మిళ.. తన రెండేళ్ల కూతురు కిల్లో గీతాంజలి కందిరీగల దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

వారిది నిరుపేద గిరిజన కుటుంబం. వంట చెరుకు కోసం కట్టలు తెచ్చేందుకు కూతుర్ని చంకన ఎత్తుకొని కొండపైకి వెళ్ళింది ఊర్మిళ. చిన్నారిని పక్కనపెట్టి కట్టెలు ఏరుకుంటుంది తల్లి. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా కూతురు గీతాంజలి ఏడ్చింది. చూసేలోగా కందిరీగలు ఆ చిన్నారిని చుట్టుముట్టాయి. ఆ చిట్టి తల్లి తల్లడిల్లుతుంటే ఆ తల్లి గుండె తరుక్కుపోయింది. చిన్నారిని రక్షించేందుకు కందిరీగలను తరిమే ప్రయత్నం చేసింది. దీంతో ఆ కందిరీగలు ఊర్మిళ పైనా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన తల్లీకూతుర్లను స్థానికులు గుర్తించి అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి గీతాంజలి ప్రాణాలు కోల్పోయింది. మెరుగైన వైద్య సాయం కోసం తల్లి ఊర్మిళను విశాఖ తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ఆమె ఊపిరి వదిలింది. దీంతో జోడిగూడలో విషాదం అలుముకుంది.

ఆడుకుంటున్న చిన్నారులపై తేనెటీగలు

మరోవైపు తేనెటీగలు కూడా ఓ చిన్నారి ఉసురు తీశాయి  వాళ్లిద్దరూ చిన్నారులు.. అన్నాచెల్లెల్లు.. ఇద్దరూ సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. ఇంతలో తేనెటిగలు స్వైర విహారం చేశాయు. అభం శుభం తెలియని ఆ చిన్నారులపై అకస్మాత్తుగా దాడి చేశాయి. దీంతో అన్నాచెల్లెళ్లకు తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పిల్లలకు సపర్యలు చేస్తుండగానే..  నాలుగేళ్ల గౌరి ప్రాణాలు కోల్పోయింది. పెదబయలు మండలం వైకుంఠవరంలో ఈ ఘటన జరిగింది. అన్న విశ్వకు తీవ్ర గాయాలు కావడంతో ముంచింగి పుట్టు ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి