Monkey Stuck in Sea: ‘లైఫ్ ఆఫ్ పై’ని తలపించే స్టోరీ.. మూడు నెలలుగా నడిసముద్రంలోనే కోతి.. చివరకు ఇలా కాపాడారు..!

|

Mar 28, 2022 | 4:39 PM

Monkey Stuck in Sea: ఎక్కడి నుండి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు కానీ.. నడి సముద్రంలో చిక్కుకుపోయింది ఓ వానరం. ఏకంగా మూడు నెలల పాటు అక్కడే జీవనం సాగించింది. నిలువ నీడ లేక.. తినేందుకు ఆహారం లేక అల్లాడిపోయింది.

Monkey Stuck in Sea: ‘లైఫ్ ఆఫ్ పై’ని తలపించే స్టోరీ.. మూడు నెలలుగా నడిసముద్రంలోనే కోతి.. చివరకు ఇలా కాపాడారు..!
Monkey
Follow us on

Monkey Stuck in Sea: ఎక్కడి నుండి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు కానీ.. నడి సముద్రంలో చిక్కుకుపోయింది ఓ వానరం. ఏకంగా మూడు నెలల పాటు అక్కడే జీవనం సాగించింది. నిలువ నీడ లేక.. తినేందుకు ఆహారం లేక అల్లాడిపోయింది. ఆ వానరాన్ని చూసి.. వేటకు వెళ్ళే మత్స్యకారులు తమ దగ్గర ఉన్న పండ్లను అందించి ప్రాణాలు నిలబెట్టారు. ఈ వానరం గురించి ఆనోటా.. ఈనోటా విన్న ఏడుగురు యువతీయువకులు దానిని కాపాడాలని నిర్ణయించుకున్నారు. నడి సముద్రంలో వానరాన్ని పట్టుకోవడం రిస్క్ అని తెలిసినా సాహసం చేశారు. అటవీ శాఖ అధికారుల సమక్షంలో ఆ వానరానికి విముక్తి కలిగించారు. ఒక మూగ జీవాన్ని రక్షించేందుకు నడి సముద్రంలో మూడు రోజుల పాటు యానిమల్ వారియర్స్ శ్రమించిన తీరుపు ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 3 కిలోమీటర్ల దూరంలో హోప్ ఐలాండ్ అనే దీవి ఉంది. దీనికి కూత వేటు దూరంలో ఐలాండ్ బ్రేక్ వాటర్‌ను నిర్మించారు. సముద్రం మధ్యలో టెట్రాపాడ్స్‌తో నిర్మించిన ఈ ఐలాండ్ బ్రేక్ వాటర్.. భారీ నౌకలు కాకినాడ పోర్టుకు వచ్చే సమయంలో కెరటాల ప్రభావం నౌకలపై పడకుండా అడ్డుకుంటుంది. ఈ ఐల్యాండ్ బ్రేక్ వాటర్‌పైకి సరిగ్గా మూడు నెలల క్రితం ఒక వానరం వచ్చింది. ఇక్కడికి ఆ వానరం ఎలా వచ్చిందో తెలీదు కానీ.. తప్పించుకోవడానికి వీలే లేకుండా పోయింది. చూట్టూ నీరు.. కనుచూపు మేరలో తీరం కనిపించకపోయే సరికి అప్పటి నుండి అక్కడే ఉండిపోయింది.

తాగేందుకు నీరు.. తినేందుకు తిండి.. ఉండేందుకు నిలువ నీడ లేకపోయే సరికి ఆ వానరం ఎంతో అల్లాడి పోయింది. కాకినాడ తీరం నుండి వేటకు వెళ్ళే మత్స్యకారుల దృష్టిలో ఈ వానరం పడటంతో దానికి కాస్త ఆహారం దొరికింది. గంగపుత్రులు దాన్ని అక్కడి నుంచి బయటపడేసే ప్రయత్నం చేసినా కుదరలేదు. రోజూ మత్స్యకారులు అందించే ఆహరం తింటూ ఆ వానరం ప్రాణాలను నిలుపుకుంది. ఈ క్రమంలో వేట కోసం ఒంగోలు వైపు వెళ్లిన మత్స్యకారుడొకరు.. వానరం విషయాన్ని అక్కడ పని చేసే ఒక స్వచ్ఛంద సంస్థకు చెప్పాడు. దీంతో వారు హైదరాబాద్‌‌లో ఉన్న యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీకి విషయాన్ని తెలియజేశారు. వెంటనే ఆ సొసైటీ నుండి ఒక యువతి.. మరో ఆరుగురు యువకులు కాకినాడకు బయలు దేరారు.

కాకినాడలో యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ ప్రతినిధి గోపాల్‌ను సంప్రదించి.. ఆపై అటవీశాఖ అధికారులను కలిశారు. దీంతో వన్యప్రాణుల విభాగం అధికారి సహాయంతో వారంతా హోప్ ఐలాండ్‌కు సమీపంలో ఉన్న ఐలాండ్ బ్రేక్ వాటర్ వద్దకు నాటుపడవపై వెళ్ళారు. మూడురోజుల పాటు తిండి‌ తిప్పలు మాని దానిని పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ట్రాప్ చేస్తే కానీ వానరం చిక్కదని భావించారు. బ్లూక్రాస్ నుంచి బోనును రప్పించి వానరానికి వల పన్నారు. ఎలాగైతేనేం మూడు రోజుల తరువాత వారు ఏర్పాటు చేసిన బోనులో వానరం చిక్కింది. దాన్ని కాకినాడకు తీసుకు వచ్చి వదిలేశారు. బోనులో నుంచి ఆ వానరం బయటపడగానే దాని పరుగు చూసి మనసున్న ఎవ్వరికైనా భావోద్వేగం కలగకమానదు. నడి సముద్రంలో చిక్కుకున్న వానరాన్ని కాపాడిన యానిమల్ వారియర్స్‌కు ప్రజలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Also read:

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 231, నిఫ్టీ 69 పాయింట్లు అప్..

Radhe Shyam: డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. రాధేశ్యామ్‌ ఓటీటీలో వచ్చేది ఆ రోజే.. అధికారిక ప్రకటన..

Ananthapur: అనంత జిల్లా మొత్తం మాదే అంటున్న జేసీ బ్రదర్స్.. మరీ వారి దూకుడుకు టీడీపీ అధినేత వైఖరేంటి..?