Vizag Steel Plant: ప్రైవేటీకరణ ఆగినా.. ఆగని మాటలమంటలు.. రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య స్టీల్‌ చిచ్చు..

ఏపీ, తెలంగాణ మధ్య ఉక్కుమంటలు రాజుకున్నాయ్‌. స్టీల్‌ప్లాంట్‌ బిడ్‌కు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం కావడం... అనూహ్యంగా ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు వేయడం... రెండు రాష్ట్రాల మధ్య మరోసారి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. కేంద్రాన్ని వెనక్కి వెళ్లేలా చేసింది తామేనని.. బీఆర్‌ఎస్‌ చెబుతుంటే... అంత సీన్‌లేదని ఏపీ అధికార పార్టీ అంటోంది. దీంతో రెండు పార్టీల మధ్య రచ్చ కాస్తా... మరోసారి రెండు రాష్ట్రాల మధ్య పంచయతీగా మారిపోయింది.

Vizag Steel Plant: ప్రైవేటీకరణ ఆగినా.. ఆగని మాటలమంటలు.. రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య స్టీల్‌ చిచ్చు..
Vizag Steel Plant

Updated on: Apr 13, 2023 | 9:38 PM

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌‌ను ప్రస్తుతానికి ప్రైవేటీకరణ చేయడం లేదని.. పూర్తిస్థాయిలో లాభాల్లోకి తీసుకురావడమే ముందున్న లక్ష్యమంటూ కేంద్ర మంత్రి చేసిన ఈ ప్రకటన కూడా తెలుగురాష్ట్రాల మధ్య మాటలయుద్ధానికి కారణమైంది. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది.. కోట్లాడింది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరేనని.. తాము తెగించి కొట్లాడడం వల్లే కేంద్రం దిగివచ్చిందన్న మంత్రి కేటీఆర్‌, హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వ పెద్దలకు సూటిగా తాకాయి. ఇలా తెలంగాణ మంత్రులు చేసిన ప్రకటనకు స్ట్రాంగ్‌ కౌంటర్లు ఇచ్చారు ఏపీ పెద్దలు. తెలంగాణ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందే నిజమైతే.. సింగరేణిపై ఎందుకు దిగిరాలేదంటూ ప్రశ్నించారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వీళ్లను చూసి తగ్గిందా అని ప్రశ్నించారు.

కేటీఆర్ మాటలు ఉట్టికి ఎగరలేని అమ్మ ఆకాశానికి ఎగిరింది అన్నట్లు ఉంటుందన్నారు. మరి తెలంగాణలో ఎందుకు తగ్గటం లేదని ప్రశ్నించారు. హరీష్ రావుది రాజకీయాల్లో మహా తెలివైన బుర్రని వ్యాఖ్యానించారు. దీనికి వ్యతిరేకించింది వైసీపీ అంటున్నారు మంత్రి బొత్స.హరీష్‌రావు బాధ్యతగా మాట్లాడాలి అని హితవు పలికారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరలా వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను మేం మొదటి నుంచి వ్యతిరేకించాం. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపాలని కేంద్రానికి సీఎం జగన్‌ లేఖ రాశారు. ప్రైవేటీకరణను ఆపాలని ప్రధాని మోదీని కలిసి సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ ప్లాంట్‌కు, బీఆర్ఎస్‌కు సంబంధమేంటని ప్రశ్నించారు బొత్స.

సీనులోకి వచ్చిన బీజేపీ మిత్రపక్షం జనసేన తమ ఘనతగా చాటుకునే ప్రయత్నం చేసింది. గతంలో అమిత్‌షాను కలిసినప్పుడు విశాఖ ఉక్కు భావోద్వేగాలో ముడిపడి ఉందని ప్రైవేటీకరణ వద్దని చెప్పామన్నారు. ఫలితంగానూ సానుకూల ప్రకటన వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు పవన్‌ కల్యాణ్‌. అటు ఏపీకి ద్రోహం చేసిన కేసీఆర్‌ కొత్తగా స్టీల్‌ ప్లాంట్‌ డ్రామాకు తెరతీశారన్నారు జీవీఎల్‌.

అటు అభివృద్ధిపై మాటల మంటలు… ఇటు స్టీల్‌ ప్లాంట్‌పై పొలిటికల్‌ ఫీట్ల మధ్య తెలుగురాష్ట్రాల రాజకీయాలు ఆసక్తిగా మారాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Loading...
Unable to load recommendations.
Follow Us