AP Weather: అల్పపీడనం ఎఫెక్ట్.. నవంబర్ 15 వరకు రాయలసీమకు భారీ వర్షసూచన..

ఏపీలోని అన్ని జిల్లాలపై అల్పపీడనం ప్రభావం ఉండదు. కానీ రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

AP Weather: అల్పపీడనం ఎఫెక్ట్.. నవంబర్ 15 వరకు  రాయలసీమకు భారీ వర్షసూచన..
Andhra Pradesh Weather Report

Updated on: Nov 11, 2022 | 9:46 AM

ఏపీని అల్పపీడనం భయపెడుతుంది. ప్రభావం కొద్ది జిల్లాలపై మాత్రమే ఉండనుందని వాతావరణ శాఖ క్లారిటీ ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం శ్రీలంక తీరానికి చేరువవుతున్నందున, నెల్లూరు తీరానికి సమీపంలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం లేదా రాత్రికి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. శనివారం ఉదయం ఈ వర్షాలు సత్యసాయి జిల్లాలోకి ప్రవేశించనున్నాయి. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే సూచనలు ఉన్నాయని  వాతావరణ శాఖ వెల్లడించింది.

అల్పపీడనం మనకు చాలా దూరంలో ఉన్నందున విశాఖపట్నం, విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది. అయితే  తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. అల్పపీడనం ఎఫెక్ట్ నవంబర్ 15 ఉండనుంది. అప్పటివరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులు పడనున్నాయి.

భారీ వర్షాల నేపథ్యంలో.. శుక్ర, శనివారాల్లో  దక్షిణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరం వెంబడి  వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈ అల్పపీడనం ఎఫెక్ట్ తమిళనాడుపై అధికంగా ఉంది. ఇప్పటికే అక్కడ వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయని పేర్కొంది. అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండదని తేల్చడంతో రైతులకు కొంత ఊరట లభించింది.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం

 

Follow Us