
బాపట్లజిల్లా చీరాలలో దారుణం జరిగింది. పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గర ఓ యువకుడు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఘుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి ఒంటిపై కత్తి గాయాలతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్టు గుర్తించి హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు స్వర్ణ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు కొండె త్రినాధ్గా గుర్తించారు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల కథనం ప్రకారం: బాపట్లజిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కొండె వెంకటేశ్వర్లు, రాజేశ్వరి దంపతుల రెండో కుమారుడు త్రినాద్(19) తన అన్నతో చీరాలలోని నానమ్మ ఇంటి దగ్గర ఉంటున్నాడు. అయితే రోజువారీ విద్యుత్ సంబంధిత కూలి పనులు చేస్తూ జీవనం సాగించే త్రినాద్ రెండు రోజుల క్రితం స్వర్ణలోని అమ్మమ్మ వద్దకు వెళ్లి వచ్చాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ బుధవారం ఉదయం చీరాల రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద విగతజీవిగా కనింపిచాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తినాద్ను హత్య చేసినట్టు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.దీంతో అక్కడి చేరుకున్న తినాద్ బంధువులు అతను ధరించిన దుస్తువుల ఆధారంగా గుర్తించి కన్నీటి పర్యంతమయ్యారు. నిండా ఇరవైఏళ్ళు కూడా లేని, త్రినాధ్ ఏం తప్పు చేశాడని దారుణంగా చంపేశారని రోదిస్తున్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంటున్నారు.
హత్యకు కారణం ప్రేమేనా?
అయితే త్రినాధ్ హత్య కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. చీరాల డిఎస్పి మొయిన్, ఒన్టౌన్ సిఐ సుబ్బారావు ఘటనా స్థలాన్ని పరిశీలించి త్రినాధ్ సెల్ఫోన్ ఆధారంగా చివరిగా అతనితో మాట్లాడిన వారిని గుర్తించారు. ఈ విచారణలో ఓ బాలిక విషయంలో మృతుడు త్రినాధ్తో అతని స్నేహితుల్లో ఒకరు గొడవ పడ్డారని గుర్తించారు. బాలికను త్రినాధ్తో పాటు మరో యువకుడు కూడా ప్రేమించాడని, అయితే ఆ బాలిక త్రినాధ్ను ప్రేమించడంతో కక్ష పెంచుకున్న యువకుడు త్రినాధ్ను పధకం ప్రకారం హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. హత్య చేసిన యువకుడితో మరి కొంతమంది హత్యలో పాలుపంచుకుని ఉన్నారని భావిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.
త్వరలోనే పట్టుకుంటాం
ఓ బాలిక ప్రేమ విషయంలో స్నేహితుల మధ్య చెలరేగిన గొడవ కారణంగా త్రినాధ్ హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేగింది. హత్యకు గురైన ప్రాంతం శివారు ప్రాంతం కావడం, ప్రతి నిత్యం రైల్వే ఓవర్ బ్రిడ్జి క్రింద మందుబాబులు మద్యం సేవిస్తూ ఉండటంతో ఎవరైనా ఈ హత్యను చూశారా. అంటూ ఆరా తీస్తున్నారు పోలీసులు. పోస్ట్ మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరిన్నిఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.