Mother suicide with her child : శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఘోరం చోటుచేసుకుంది. భర్త మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ.. కుమారుడితో సహా ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీశైలం దేవస్థానం అన్నదాన సెక్షన్లో పనిచేస్తున్న మేకల బండ చెంచుగూడెంకు చెందిన తోకల నాగమ్మ పెద్ద కుమార్తె శ్రావణి(28)ని అదే గూడేనికి చెందిన నిమ్మల నాగన్నకు ఇచ్చి 2014లో వివాహం చేశారు. వీరికి లోహిత్ చంద్ర, రోషీనీ, శివతరుణ్(ఒకటిన్నర సంవత్సరాలు) సంతానం. శ్రావణి కూడా దేవస్థానంలో స్వీపర్గా పనిచేస్తోంది. ఈ క్రమంలో శ్రావణి మూడు రోజుల క్రితం బంధువుల పెళ్లికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో వరుసకు బావ అయిన వ్యక్తితో కలిసి బైక్పై వచ్చింది. అయితే, ఈ విషయంలో భర్త నాగన్నతోపాటు బంధువులు శ్రావణిని మందలించారు. దీనిని అవమానంగా భావించిన శ్రావణి తీవ్ర మనస్తాపానికి గురైంది. సోమవారం ఉదయం ఒకటిన్నరేళ్ల ఆమె చిన్న కుమారుడు శివతరుణ్ను తీసుకొని వెళ్లి.. సారంగధర మకం వద్ద ఉన్న బావిలో కుమారిడితో సహా దూకి ఆత్మహత్య చేసుకుంది. వారి కోసం కుటుంబీకులు గాలిస్తున్న క్రమంలో మంగళవారం మధ్యాహ్నం బావిలో మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, శ్రావణి చేసిన పనితో గూడెం మొత్తం విషాదంలో మునిగిపోయింది.