వెంకన్న స్వామికి బంగారు పూతరేకులు సమర్పించిన భక్తుడు!
అక్షయ తృతీయ పర్వదినం పురస్కరించుకొని కోనసీమ తిరుమల వాడపల్లి చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామివారికి స్వర్ణ పూతరేకులను ఒక భక్తుడు అందజేశారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన (ఇడబుల్ గోల్డ్ ) పూతరేకులను స్వామివారికి సమర్పించడం ఇదే తొలిసారి కావడం విశేషంగా నిలిచింది.

అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆత్రేయపురం గ్రామానికి చెందిన చాదస్తం ఫుడ్స్ సంస్థ తరఫున చవ్వాకుల సాయి గణేష్, లక్ష్మీ ప్రసన్న దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకంగా తయారు చేసిన బంగారు పూతరేకులను సమర్పించారు.ఈ సందర్భంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన పూతరేకులను ఆలయానికి తీసుకువెళ్లి స్వామివారికి ప్రసాదంగా అందజేశారు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద కుమార్తె సంజన వాసుకు సుమారు 25 కిలోల లడ్డూలతో తులాభారం నిర్వహించగా, చిన్న కుమార్తె సరయుకు సుమారు పదమూడు వందల పూతరేకులతో తులాభారం నిర్వహించారు.అనంతరం ఆ స్వీట్లను భక్తులకు పంపిణీ చేశారు. అక్షయ తృతీయ సందర్భంగా అందరికీ ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలని వారు ఆకాంక్షించారు..ఆలయానికి అందించిన సువర్ణ పూతరేకులను ఇడిబుల్ గోల్డ్ అని పిలుస్తారు మొత్తం ఆరు పూతరేకులు గుడిలో ఇవ్వగా దీని విలువ 6000 ఉంటుంది అని చెప్తున్నారు భక్తుడు.
