
Riti Saha’s death case: బెంగాల్ విద్యార్ధిని రితీ సాహా అనుమానాస్పద మృతి కేసులో ఆంధ్ర ప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదని విద్యార్థిని తల్లి తండ్రుల ఫిర్యాదుతో కొలకత్తా నేతాజీ నగర్ పీఎస్లో కేసు నమోదు చేఇవారు. సెక్షన్ 302 – హత్యా నేరం కింద కేసు నమోదు చేసిన బెంగాల్ పోలీసులు 4 రోజులుగా విశాఖలో తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు. రీతీసాహా మృతిపై బెంగాల్ పోలీసులు మొదట సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సాధనా హాస్టల్ టెర్రస్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునే అవకాశాలను పరిశీలించారు. రీతీసాహాను పోలిన ఓ తయారు చేసిన బొమ్మను హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి వేసి మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇరుకు భవనాలు కావడంతో దూకితే సరిగ్గా ఎక్కడ పడుతుంది.. ఎలా దెబ్బలు తగుల్తాయన్న కోణంలో బెంగాల్ పోలీసులు తొలుత విచారణ చేపట్టి వివరాలు సేకరించారు.
అనంతరం ద్వారకా నగర్లోనే ఉన్న వెంకట రామ హాస్పిటల్కు వెళ్లారు బెంగాల్ పోలీసులు. రీతి సహా కింద పడ్డ వెంటనే నేరుగా ఆ హాస్పిటల్లోనే జాయిన్ చేశారు. అక్కడ సరిగా వైద్యం చేయలేదన్నది విద్యార్దిని తండ్రి సుఖ్ దేవ్ సహా ఆరోపణ. దీంతో బెంగాల్ పోలీసులు ఆ హాస్పిటల్ యాజమాన్యంతో సమావేశమయ్యారు. ఏ పరిస్థితులలో వచ్చింది, చికిత్స అందడంలో నిర్లక్ష్యం ఏమైనా ఉందా? మరణ వాంగ్మూలం ఎందుకు నమోదు చేయలేదంటూ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు బెంగాల్ పోలీసులు. అదే సమయంలో ఆసుపత్రిలో రీతీసాహకు వైద్యం చేసే సమయంలో వీడియో ఒకటి వెలుగు చూసింది. దీనిపైనా వివరాలు అడిగి తెలుసుకున్నారు బెంగాల్ పోలీసులు.
Riti Saha’s Death Case
అనంతరం ఈ కేసు విచారణ అధికారిగా ఉన్న ఫోర్త్ టౌన్ సీఐ శ్రీనివాసరావు తోనూ కేసు పూర్వాపరాలపై విచారణ చేశారు బెంగాల్ పోలీసులు. వెంటనే సీసీ ఫుటేజ్ను ఎందుకు తీసుకోలేదు, హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు లేకపోతే వేరే హాస్పిటల్కు ఎందుకు మార్చలేదు..? లాంటి అనేక అంశాలను నాలుగో పట్టణ సీఐను అడిగి తెలుసుకున్నారు బెంగాల్ పోలీసులు. అయితే ఈ కేసులో విచారణలో లోపాలు ఉండడంతో ఇప్పటికే ఆయన్ను సీపీ సరెండర్ చేసిన విషయం తెలిసిందే.
కేసు పూర్వాపరాలను చూస్తే.. జూలై 14న పశ్చిమ బెంగాల్ కి చెందిన రీతీ సాహా విశాఖపట్టణంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. విశాఖపట్టణంలోని నరసింహనగర్ లోగల సాధనా హస్టల్లో రీతీసాహా ఉంటుంది. విశాఖలోని ఆకాష్ బైజూస్లో నీట్ కోచింగ్ తీసుకుంటూ ఆ కళాశాలకు అనుబంధంగా ఉన్న హస్టల్ భవనం నాలుగో అంతస్తుపై నుంచి పడి రీతీసాహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రీతీసాహాను ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో ఆమె వైద్యానికి సహకరించలేదని, వేరే హాస్పిటల్కు మార్చినా ఉపయోగం లేకుండా పోయిందని ఆమె తల్లితండ్రులకు హాస్టల్ యాజమాన్యం ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళు వైజాగ్ వచ్చారు.
కేసు విచారణలో విశాఖపట్టణం పోలీసుల తీరుపై మృతురాలి తండ్రి శుఖ్ దేవ్ అనుమానాలు వ్యక్తం చేశారు. తన కూతురును రూంలో హత్య చేసి మిద్దెపై నుంచి తోసేశారని, ఆమె 10.30 కి టెర్రస్ పైకి వెళ్తే 9.30 కే మిద్దె పై నుంచి దూకినట్టు సీసీ ఫుటేజ్ ఉందని, ఇవ్వన్నీ విశాఖ పోలీసులు పట్టించుకోలేదని తండ్రి ఆరోపిస్తున్నారు. అదే సమయంలో హస్టల్ భవనంపైకి వెళ్లే సమయంలో ఓ డ్రస్, భవనంపై నుండి కిందకు పడే సమయంలో మరో డ్రెస్ ఉందని, అసలు టెర్రస్ పైకి వెళ్ళింది రీతీసాహానే కాదని తండ్రి వాదన..
ఈ విషయంపై విద్యార్థిని తల్లిదండ్రులు బెంగాల్ సీఎం మమత బెనర్జీకి ఫిర్యాదు చేశారు. బెంగాల్ సీఎం ఆదేశం మేరకు కల్కత్తాలో కేసు నమోదైంది. దీంతో బెంగాల్ పోలీసులు విశాఖపట్టణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న విచారణలో కలకత్తా పోలీసులు ఎలాంటి నిర్ణయానికి వస్తారోనన్న చర్చ ప్రస్తుతం పెద్ద ఎత్తున నడుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..