
కాకినాడలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. స్వాతంత్ర్య సంగ్రామం మన వారసత్వ సంపదని, స్వేచ్ఛ వెనుక ఉన్న త్యాగాలను పిల్లలకు వివరించాలని చాగంటి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. దేశభక్తి కలిగిన లోకేష్ విద్యాశాఖ మంత్రి కావడం విద్యార్థుల అదృష్టమని ఆయన ప్రశంసించారు.
కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. సమాజంలో నిజమైన మార్పు తరగతి గది నుంచే సాధ్యమవుతుందని, ఆ మార్పును తీసుకురావడానికే తాను విద్యాశాఖను ఎంచుకున్నానని తెలిపారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు చిన్న చిన్న సమస్యలకే కుంగిపోకుండా ధైర్యంతో ఎదురొడ్డి పోరాడాలని సూచించారు.
విద్యావ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతోదనడానికి నిదర్శనంగా ఈ ఏడాది ఏకంగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారారని, ఇంటర్లో కూడా 10 వేల అడ్మిషన్లు పెరిగాయని వెల్లడించారు. విద్యావ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసిన లోకేష్.. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. తాను ఈ స్థాయికి చేరడం వెనుక తన తల్లి కష్టం, త్యాగం ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. అలాగే చాగంటి గారిని కలిసిన ప్రతిసారీ తనలో కొత్త పాజిటివ్ ఎనర్జీ వస్తుందని కొనియాడారు.
ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సంగ్రామం కేవలం ఒక గత చరిత్ర కాదని, అది భావితరాలకు మనం అందించాల్సిన వారసత్వ సంపద అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు నడయాడిన ప్రదేశాలను సందర్శించడం వల్ల దేశభక్తి పెరుగుతుందని, ముఖ్యంగా అండమాన్లోని కాలాపాని జైలు గురించి చదివితే మన వీరులు అనుభవించిన కష్టాలు మనసును కలచివేస్తాయని అన్నారు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వెనుక ఉన్న త్యాగాలను పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దేశభక్తి కలిగిన నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి కావడం ఈ రాష్ట్ర విద్యార్థుల అదృష్టమని ఆయన కొనియాడారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..