YCP-TDP: ఏపీలోని కైకలూరు నియోజకవర్గంలో చంద్రబాబుకు షాక్..! వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జంప్..!
ఏపీలోని కైకలూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ ఇంచార్జ్ జయమంగళ వెంకటరమణ వైసీపీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న వెంకటరమణ ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో పార్టీల జంపింగ్ జపాంగ్లు మొదలయ్యాయి. కీలక నియోజకవర్గాల్లో ప్రత్యర్ధి పార్టీలను దెబ్బ కొట్టేందుకు పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నాయి. వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఆ పార్టీకి నష్ట చేసేలా తెలుగు దేశం పార్టీ కొత్త ఎత్తుగడలు మొదలు పెట్టింది. దీనికి కౌంటర్గా టీడీపీకి బలం ఉన్న క్రిష్ణా జిల్లా లో వైసీపీ కొత్త ప్లాన్ రెడీ చేసింది. అందులో భాగంగా టీడీపీకి చెందిన నేతలను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే కొందరు ముఖ్య నేతలు అధికార పార్టీతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా.. టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జ్ జయమంగళ వెంకటరమణ వైసీపీలోకి వెళ్లేందుకు రంగం రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జనసేనతో పొత్తు కారణంగానే ఆ నేత అధికార పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం జోరందుకుంది.
ఇప్పటికే పలు దఫాలుగా మంతనాలు జరిపిన మంత్రి కారుమూరి.. చివరికి వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు జగన్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటికే నలుగురు గన్మెన్లను వెంకట రమణకు కేటాయించిన జగన్ ప్రభుత్వం. స్థానిక సంస్థల్లో ఖాళీ అవుతున్న 8 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి వెంకటరమణకి కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు. వెంకటరమణ జంప్తో స్థానికంగా టీడీపీ బలహీనపడుతుందని వైసీపీ అంచనా వేస్తోంది.
కైకలూరు రాజకీయ ఘన చరిత్ర
రాజకీయంగా ఘనమైన చరిత్ర కలిగిన కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో… 1952 నుంచి 2019 వరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నియోజకర్గాల పునర్విభజనకు పూర్వం కైకలూరు పరిధిలో కైకలూరు, కలిదిండి, మండవల్లి మండలాలు మాత్రమే ఉండేవి. అయితే, ఆ తర్వాత ముదినేపల్లి మండలం కూడా ఈ నియోజకవర్గంలో కలవడంతో కాస్త పెద్దదైంది. ఇక్కడ పార్టీల వారీగా ట్రాక్ రికార్డు చూస్తే.. ఒక్కో విధంగా ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 9సార్లు గెలవగా… టీడీపీ రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. 1993 ఉప ఎన్నికల్లో వై.రాజా రామచందర్ టిడిపి నుంచి గెలిచినా.. ఏడాది మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే,1994 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత మరో పదిహేనేళ్లు సైకిల్కు గెలుపు దక్కలేదు. 2009లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన జయమంగళ వెంకటరమణ.. పూర్తికాలం పదవిలో ఉన్నారు.
కైకలూరులో ఇండిపెండెంట్లు 3సార్లు, బిజెపి ఒకసారి విజయం సాధించాయి. 2014లో టీడీపీతో పొత్తులో ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన కామినేని శ్రీనివాస్… చంద్రబాబు కేబినెట్లో మంత్రిగానూ పనిశారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో… రకరకాల మార్పులు జరిగాయ్ అది వేరే విషయం. ఇక, 2019లో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన దూలం నాగేశ్వరరావు .. అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా మరోసారి ప్రజల దగ్గరికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
గణాంకాల ప్రకారం..
కైకలూరు నియోజకవర్గంలో… రెండు లక్షల పైచిలుకు మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. వీరిలో కాపులు, బి.సిలు, యస్సీ సామాజిక వర్గ జనాభే అధికంగా ఉంటుంది. ఇక్కడ జయాపజయాలను సైతం వాళ్లే నిర్దేశించే పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చేసారి ఫలితం ఉంటుందనేది.. వారి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కొల్లేరు ప్రాంతం ఈ నియోజకవర్గ పరిధిలో ఉండటం మరో విశేషం. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టే కైకలూరు నియోజకవర్గంలో ఏపీ రాజకీయాల్లో సమ్థింగ్ స్పెషల్గా నిలిచింది.
మరిన్ని ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం




